
మిర్చి నిల్వకు శీతల గోదాముల కొరత
రాయచూరు రూరల్: ఎండు మిర్చి అన్నదాతను కన్నీరు పెట్టిస్తోంది. మార్కెట్కు తీసుకెళ్తే ఆశించిన ధరలు ఉండవు. నిల్వ చేద్దామంటే శీతల గోదాముల కొరత, పొలాలు, ఇళ్ల వద్ద నిల్వ చేసుకుంటే వర్షాలకు పంట తడిసిపోతుందనే భయం. ఇలా మిర్చి రైతు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాడు. రాయచూరు, యాదగిరి, విజయపుర, బాగల్ కోటె, గదగ్, కొప్పల్ జిల్లాల్లో మిర్చి పంట లక్షల ఎకరాల్లో సాగైంది. రెండేళ్ల క్రితం మిరప మంచి ధర పలికింది. దీంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపారు.అయితే గత ఏడాది నుంచి ధరలు పతనం అయ్యాయి. దీంతో చోలా మంది రైతులు మిర్చిని గోదాముల్లో నిల్వ చేశారు. ఈక్రమంలో ఈ ఏడాది సాగైన మిర్చి పంట నిల్వ చేసేందుకు గోదాముల కొరత ఏర్పడింది. మరో వైపు యజమానులు గోదాముల అద్దె పెంచారు. దీంతో మిర్చిని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏ గోదాము వద్దకు వెళ్లినా స్థలం లేదని చెబుతున్నారు. గత్యంతరం లేక పొలాల వద్ద మిర్చిని రాసులుగా పోసి ప్లాస్టిక్ తారపాళ్లు కప్పి పంటను కాపాడుకుంటున్నారు. అయితే పెనుగాలు, వడగండ్ల వర్షాలు కురిస్తే మిర్చి మొత్తం తడిసిపోయి కాయలు నల్లరంగులో మారుతుంది. అలాంటి పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకురారు. వచ్చినా తక్కువ ధరకు అడుగుతారు. ప్రభుత్వం అవసరమైన మేర గోదాములు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తెది కాదు. ఇదిలా ఉండగా గతంలో కోల్డ్ స్టోరేజలో బస్తాకు రూ.30 అద్దె ఉండగా నేడు రూ.వందకు పెంచారు. అసలు ధరలే పడిపోగా అద్దెలు పెంచడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని శీతల గోదాములు ఏర్పాటు చేయాలని, అద్దెలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అద్దె ధరలు పెంచిన యజమానులు
పొలాల వద్దనే మిరప నిల్వలు
వర్షాలతో తడిసి అన్నదాతలకు నష్టాల

మిర్చి నిల్వకు శీతల గోదాముల కొరత