
మంత్రి కారు ప్రమాదం కేసు.. లారీ డ్రైవరు అరెస్టు
దొడ్డబళ్లాపురం: గతంలో మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ కారును ఢీకొట్టి వాహనం ఆపకుండా పరారైన లారీ డ్రైవర్ను బెళగావి కిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన మధుకర కొండిరాయ సోమవంశీ (65) అరైస్టెన ట్రక్ డ్రైవర్. జనవరి 14న తెల్లవారుజామున మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్, ఆమె తమ్ముడు ఎమెల్సీ చన్నరాజు, గన్మ్యాన్ కారులో బెంగళూరు నుండి బెళగావి వెళ్తుండగా కిత్తూరు సమీపంలో వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. అదుపుతప్పిన కారు రోడ్డుపక్కన చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మంత్రి తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కిత్తూరు పోలీసులు ఇన్నాళ్లపాటు విచారించి మహారాష్ట్రలో నిందితున్ని అరెస్టు చేశారు.
పోలీసులపై వీలింగ్
పోకిరీల దాడి
దొడ్డబళ్లాపురం: రోడ్లపై ప్రమాదకరంగా వీలింగ్ చేస్తున్న యువకులను పట్టుకోబోయిన పోలీసులపైనే దాడి చేసిన సంఘటన రామనగర పరిధిలోని యారబ్ నగరలో చోటుచేసుకుంది. రాత్రివేళ మెయిన్ రోడ్లపై కొందరు స్థానిక యువకులు, మైనర్లు వీలింగ్ చేస్తూ ఇబ్బందిపెడుతున్నారని పలుసార్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో వీలింగ్ చేస్తున్న ఆకతాయిలను పట్టుకోవడానికి ప్రయత్నించగా తిరగబడ్డారు. దీంతో తోపులాట, బాహాబాహీ జరిగింది. ప్రధాన నిందితుడు సైఫ్ ఖాన్, ఇతని తండ్రి యూసుఫ్ ఖాన్ మరియు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో తండ్రీ కొడుకులని అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు.
గజరాజులచే సిటీ బస్ అడ్డగింత
దొడ్డబళ్లాపురం: అడవిలో నుంచి రోడ్డుమీదకు వచ్చిన ఏనుగుల గుంపు బీఎంటీసీ బస్సును అడ్డగించి అటూఇటూ ఊపిన సంఘటన కనకపుర తాలూకా కగ్గలీపురలో జరిగింది. గురువారం ఉదయం కేఆర్ మార్కెట్టు నుంచి సిటీ బస్సు గుల్లహట్టి వైపు వెళ్తుండగా కగ్గలీపుర వద్ద హఠాత్తుగా ఐదారు ఏనుగులు రోడ్డుకు అడ్డంగా వచ్చాయి. బస్సును చుట్టుముట్టి తొండాలతో అటూఇటూ ఊపాయి. ఈ సంఘటనతో డ్రైవర్, కండక్టర్లతో పాటు ప్రయాణికులు భయంతో విలవిలలాడిపోయారు. కొంతసేపటికే పక్కు వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సవదత్తి ఆలయం వద్ద ఉద్రిక్తత
యశవంతపుర: బెళగావి జిల్లా సవదత్తి యల్లమ్మ దేవస్థానం వద్ద అక్రమంగా వెలసిన అంగళ్లును తొలగించే ప్రయత్నంలో అధికారి ఒకరు వ్యాపారులను అసభ్యంగా తిట్టడం వివాదమైంది. ఆలయ ప్రాధికారచే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అడ్డుగా ఉన్న అంగళ్లను తొలగిస్తున్నారు. గురువారం ఉదయం ప్రాధికార కమిషనర్ అశోక దుడగుంటి వచ్చినప్పుడు వ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. అశోక దుడగుంటి అసభ్య పదాన్ని ఉపయోగించటంతో వ్యాపారులు మండిపడి ధర్నా చేశారు. కొంతసేపు దేవస్థానం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నేలకొన్నాయి. పోలీసులు వ్యాపారులకు నచ్చచేప్పి పంపారు.
సీఈటీలో నకిలీ అభ్యర్థి
బనశంకరి: చివరి క్షణంలో వచ్చి సీఈటీ పరీక్ష రాయడానికి ప్రయత్నించిన నకిలీ అభ్యర్థి బండారం బట్టబయలైంది. నగరంలో మల్లేశ్వరం 7వ రోడ్డు సిల్వర్ వ్యాలీ పీయూ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి గురువారం ఉదయం గణితం పరీక్ష రాయడానికి వచ్చి నేరుగా మరుగుదొడ్డిలోకి వెళ్లాడు, గంటయినా బయటికి రాలేదు. పరీక్ష ప్రారంభమయ్యే సమయంలో వచ్చి క్యూఆర్ కోడ్ ఉన్న హాల్టికెట్ చూపించాడు. సిబ్బంది ఫేస్ స్కాన్ చేయగా అభ్యర్థి కాదని తేలింది. సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పేలోపు నకిలీ అభ్యర్థి ఉడాయించాడని కర్ణాటక పరీక్షా ప్రాధికార డైరెక్టర్ హెచ్.ప్రసన్న తెలిపారు. అసలు అభ్యర్థి ఫోటోపై అతని ఫోటోని అతికించాడని, ఫేస్ స్కానింగ్ వల్ల మోసం బయట పడిందని తెలిపారు.

మంత్రి కారు ప్రమాదం కేసు.. లారీ డ్రైవరు అరెస్టు