స్వాతంత్య్ర పోరుకు ‘సాహితీ’ బాట | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర పోరుకు ‘సాహితీ’ బాట

May 22 2023 12:36 AM | Updated on May 22 2023 12:36 AM

సదస్సులో పరిశోధన పత్రాల పుస్తకాన్ని అవిష్కరిస్తున్న వీసీ, ఇతర ప్రముఖులు - Sakshi

సదస్సులో పరిశోధన పత్రాల పుస్తకాన్ని అవిష్కరిస్తున్న వీసీ, ఇతర ప్రముఖులు

మైసూరు: భారతదేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరుబాటకు ప్రముఖ కవులెందరో సాహితీ బాట వేశారని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శరణప్ప.వి. హలసె అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో తెలుగు, కన్నడ కవులు పాత్ర అనే అంశంపై యూనివర్సిటీ ప్రాంగణంలో తెలుగు అధ్యయన, పరిశోధన విభాగం శాఖాధ్యక్షుడు ఆచార్య ఎం.రామనాథం నాయుడు, ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వాతంత్య్రం సంపాదించడానికి దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరిగాయన్నారు. ఇందులో భాగంగా ప్రముఖ కవులు, రచయితలు ఎన్నో కావ్యాలు, గేయాలు, నాటికలు రచించి, బ్రిటీషు పాలనలో అన్యాయాలను ఎండగట్టారన్నారు. స్వాతంత్య్ర ఆవశ్యకత, ఉద్యమ తీరు తదితర అంశాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రచనలు చేశారన్నారు. స్వాతంత్య్ర ఆవశ్యకత, ఉద్యమ తీరును సామాన్యులకు అర్థమయ్యేలా రచనలు చేశారన్నారు. ఆచార్య రామనాథం నాయుడు మాట్లాడుతూ తెలుగులో చిలకమర్తి లక్ష్మీ నరసింహం నుంచి రాయప్రోలు సుబ్బారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, బసవరాజు అప్పారావు తదితర ఎంతో మంది కవులు అందించిన సాహితీ సేవలు ఎనలేనివన్నారు. కన్నడ కవుల్లోనూ స్వాతంత్య్ర పోరుకు కృషి చేసిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్న నేటి తరం నాటి పోరాట యోధులతో పాటు ఉద్యమానికి సాహితీ మార్గంలో సేవలందించిన కవులనూ గుర్తుంచుకోవాలని సూచించారు. కన్నడ అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ఎం తళవార్‌ మాట్లాడుతూ కరీం ఖాన్‌, జెట్టిగేరి కృష్ణ శర్మ, బెంద్రే, తిరుమల రాజమ్మ లాంటి కన్నడ కవులెందరో సేవలందించినట్లు తెలిపారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ఎల్‌ మూర్తి మాట్లాడుతూ 1857 సిపాయిల తిరుగుబాటును ధర్మ పోరాటంగానే గుర్తించాలని, ఆ సమయంలో సాహితీవేత్తల సేవలు మరువలేనివని అన్నారు. సదస్సులో తెలుగు, కన్నడ సాహితీవేత్తలు, భాషాభిమానులు, పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులతో పాటు డీన్‌ ఆచార్య లక్ష్మీ, డాక్టర్‌ మన్యం నర్సింహులు, డాక్టర్‌ బి. చక్రవర్తి, డాక్టర్‌ బి. నాగశేషు ఆచార్య ప్రవీణ్‌, డాక్టర్‌ ఖాదర్‌ పాషా, డాక్టర్‌ పోసుపాటి శంకర్‌రావు పాల్గొన్నారు.

ఉద్యమానికి ఉప్పందించిన తెలుగు, కన్నడ కవులు

కేఎస్‌ఓయూ జాతీయ సదస్సులో వక్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement