అన్ని పార్టీల్లోనూ డిపాజిట్లు దక్కని అభ్యర్థులు | - | Sakshi
Sakshi News home page

అన్ని పార్టీల్లోనూ డిపాజిట్లు దక్కని అభ్యర్థులు

May 18 2023 8:21 AM | Updated on May 18 2023 8:21 AM

- - Sakshi

కర్ణాటక : 2023 అసెంబ్లీ ఎన్నికలు కొందరు అభ్యర్థులకు భారీ విజయాన్ని కట్టబెట్టగా మరికొందరికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అత్యల్ప మెజార్టీతో గెలిచినవారు కొందరైతే..మరికొందరికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ పరిస్థితులు అన్ని పార్టీల్లోనూ కనిపించాయి. ఈసారి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,613మంది అభ్యర్థులు పోటీ చేశారు.

బీజేపీ నుంచి 224 మంది, కాంగ్రెస్‌ నుంచి 223 మంది, జేడీఎస్‌ నుంచి 207మంది పోటీ చేశారు. 918మంది ఇండిపెండెంట్‌లు పోటీ చేశారు. వీరిలో 389మంది ఓటమిపాలవ్వగా 210 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. జేడీఎస్‌ నుంచి పోటీ చేసిన 207మందిపైకి కేవలం 19మంది మాత్రమే గెలిచారు.136 మంది జేడీఎస్‌ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. కడూరులో పోటీ చేసిన వైవీఎస్‌ దత్త కేవలం 26,837 ఓట్లు రాబట్టారు. శివమొగ్గలో జేడీఎస్‌ అభ్యర్థి ఆయనూరు మంజునాథ్‌ కూడా డిపాజిట్లు కోల్పోయారు. బీజేపీ నుంచి 224 మంది పోటీ చేయగా 66 మంది మాత్రమే గెలిచారు.

ఓటమిపాలైన వారిలో 31మందికి డిపాజిట్లు రాలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12మంది అభ్యర్థులు కూడా డిపాజిట్లు కోల్పోయారు. కనకపురలో డీకే శివకుమార్‌పై పోటీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్‌ అశోక్‌కు డిపాజిట్‌ కూడా దక్కలేదు. అయితే ఈయన పద్మనాభనగర్‌లో విజయం సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement