బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026

May 19 2026 11:47 PM | Updated on May 19 2026 11:47 PM

బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026 ● జిల్లాపై నిప్పుల కుంపటి ● ఈనెల 25 వరకు రెడ్‌ అలర్ట్‌ ● 44 డిగ్రీల సెల్సియస్‌ దాటిన గరిష్ట ఉష్ణోగ్రత ● రాబోయే రోజుల్లో 45 డిగ్రీలకు చేరే అవకాశం ● ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన ● అనుసంధాన రుణాలకు కీలకం ● ఇకపై నూతన విధానంలో రుణాలు ఊటీ వెళ్లాలని ఉందా.. ● 30న కరీంనగర్‌–2 డిపో నుంచి ప్రత్యేక బస్సు జిల్లాలో మంగళవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ● వేసవితీవ్రతతో ఎన్యుమరేటర్ల ఇబ్బంది ● ఉదయం వేళల్లోనే వివరాల సేకరణ ● రోజుకు 25 గృహాల వివరాలు యాప్‌లో నమోదు ● ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

న్యూస్‌రీల్‌

జాగ్రత్తలు తీసుకోవాలి

కరీంనగర్‌: ఊపిరాడనివ్వని ఉక్కపోత.. మాడు పగిలేలా దంచి కొడుతున్న ఎండలు.. చెవుల్లో నిప్పులు పోసినట్లు వీచే వేడిగాలులు.. ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి తేడా లేకుండా కొద్దిరోజులుగా వేడెక్కుతున్న వాతావరణం ప్రతీ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం పది గంటలకే ఎండ దంచి కొడుతుండగా.. మధ్యాహ్నం అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తోంది. సాయంత్రం వేడిగాలులు వీస్తుండగా.. పగలూ రాత్రి లేకుండా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలకు బేజారు అవుతున్నారు. ఉదయం, సాయత్రం పనులు పూర్తిచేసుకుని, మధ్యాహ్నం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద సేదతీరుతున్నారు.

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌– 2 డిపో నుంచి ఈనెల 30న మైసూర్‌, ఊటీ విహారయాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామ ని డిపో మేనేజర్‌ ఎం. శ్రీనివాస్‌ తెలిపారు. 30న మధ్యాహ్నం 3గంటలకు కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ నుంచి రాజధాని ఏసీ బస్సు బయల్దేరుతుందన్నారు. 31న మైసూర్‌ చేరుకుంటుందన్నారు. మైసూర్‌ ప్యా లెస్‌, చాముండే ఆలయం, బృందావన్‌ గార్డెన్‌ సందర్శన తువాత రాత్రి బస అక్కడే ఉంటుందన్నారు. 1న ఉదయం 4గంటలకు మైసూర్‌ నుంచి బస్సు బయల్దేరి ఊటీ చేరుకుంటుందన్నారు. ఊటీలోని వివిధ ప్రదేశాల సందర్శన అనంతరం 3వ తేదీన ఊటీ నుంచి బయల్దేరి బెంగళూరు చేరుకుంటుందన్నారు. అక్కడ బొటానికల్‌ గార్డెన్‌, ఇస్కాన్‌ టెంపుల్‌, బెంగళూరు ప్యాలెస్‌ సందర్శన అనంతరం అక్కడి నుంచి బయల్దేరి 4వ తేదీన కరీంనగర్‌ చేరుకుంటుందని వివరించారు. ఈ విహారయాత్రకు పెద్దలకు రూ.8వేలు, పిల్లలకు రూ.6వేలు టికెట్‌ చార్జి ఉంటుందని, ప్రయాణంలో భోజనం, దర్శనాల టికెట్‌ ఖర్చులు ప్రయాణికులే భరించాలని సూచించారు. వివరాలకు 7382847727, 7382850708, 8978383084 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

చిన్న పిల్లలతో భిక్షాటన చేయించొద్దు

విద్యానగర్‌(కరీంనగర్‌): కరీంనగర్‌ బస్టాండ్‌ పరిసరాల్లో చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తున్నారనే సమాచారంతో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 స్టిక్కర్లు అతికించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 జిల్లా కోఆర్డి నేటర్‌ ఆవుల సంపత్‌ మాట్లాడుతూ బస్టాండ్‌ పరిసరాల్లో చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తున్న వారి గురించి విచారించినట్లు తెలిపారు. చిన్న పిల్లలతో భిక్షాటన చేయించడం, తప్పిపోయిన పిల్లలు కనిపించడం, ఇంటి నుండి పారిపోయిన పిల్లలు లేదా ప్రేమపేరుతో ఇంటి నుంచి వచ్చి ఒంటరిగా ఉన్న పిల్లలు కనిపిస్తే చైల్డ్‌ హె ల్ప్‌లైన్‌ 1098కు సమాచారం ఇవ్వాలన్నారు. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ బృంద సభ్యులు సుందరగిరి సాయికిరణ్‌ గౌడ్‌, ఎడ్ల ప్రియాంక పాల్గొన్నారు.

పెట్రో ధరలు తగ్గించాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. నాలుగు రోజుల్లో లీటరు పెటోల్‌, డీజిల్‌పై రూ.4 చొప్పున భారం వేసి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచిందని విమర్శించారు. ఒక్కసారి పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, విడతల వారీగా పెంచుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం నీట్‌ పరీక్ష సక్రమంగా నిర్వహించే సత్తా కేంద్రానికి లేదన్నారు. ధరలు పెరిగాయంటూ భవిష్యత్‌లో ప్రజలను గంజినీళ్లు తాగుమని ప్రధాని చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నాయకులు తాజొద్దీన్‌, పిట్టల రవీందర్‌, మల్లికార్జున రాజేందర్‌, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్‌, పడిశెట్టి భూమయ్య, వరాల నర్సింగం పాల్గొన్నారు.

రేపటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 21 నుంచి ప్రారంభం అవుతుందని డీఐఈవో వి.ఆంజనేయరావు తెలిపారు. కరీంనగర్‌లోని డాక్టర్స్‌ స్ట్రీట్‌లోని బాలికల జూనియర్‌ కళాశాలలో తొలి సెషన్‌లో భాగంగా ఇంగ్లిష్‌, తెలుగు, మ్యాథ్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులలో మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఉత్తర్వులు అందిన అధ్యాపకులను స్పాట్‌ కోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌ రిలీవ్‌ చేయాలని సూచించారు.

మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా తెలంగాణచౌక్‌ ప్రాంతం

ఉక్కపోత..

ఉక్కిరిబిక్కిరి

కరీంనగర్‌లోనే అత్యధికంగా

ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోలిస్తే కరీంనగర్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండకు తోడు వడగాలుల ప్రభావం ఉండడంతో ప్రజలు ఉష్ణతాపాన్ని భరించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. జిల్లాకు వాతావారణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇప్పటికే 44 డిగ్రీల సెల్సియస్‌కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, అవి రానున్న మూడు నాలుగు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఇప్పటికే ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నెల 25 వరకు జిల్లాలో 45 డిగ్రీల కన్నా ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. మరో నాలుగు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ కొనసాగనుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

జిల్లా అంతటా 43 డిగ్రీలపైనే

కరీంనగర్‌ సిటీతో పాటు హుజూరాబాద్‌, చొప్పదండి, మానకొండూర్‌లో గరిష్టంగా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం కరీంనగర్‌లో గరిష్టంగా 44 డిగ్రీలు, హుజూరాబాద్‌లో 43.5 డిగ్రీలు, చొప్పదండిలో 43 డిగ్రీలు, మానకొండూర్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌లో రోజంతా రద్దీగా ఉండే తెలంగాణచౌక్‌, టవర్‌సర్కిల్‌, బస్టాండ్‌ ఏరియా, కమాన్‌రోడ్‌ ప్రాంతాలు మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

ఇళ్లకే పరిమితమవుతున్న జనం

భానుడి తాపంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు మినహాయించి బయట పనులకు వెళ్లినవారు 11 గంటలలోపు ఇళ్లకు చేరుకుంటున్నారు. గతంలో కన్నా ఈసారి ఎండల తీవ్రత పెరగడం, గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఇంట్లోనూ వేడిని తాళలేక ఏసీలు, కూలర్లు పెట్టుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. రాబోయే 4 రోజుల్లో 45 డిగ్రీలకు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

జనగణనకు ‘సన్‌’స్ట్రోక్‌

కరీంనగర్‌రూరల్‌: జనగణనకు వేసవికాలం ఎండలు అడ్డంకిగా మారాయి. ఎండ తీవ్రతకు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 10గంటల్లోపే గృహాల వివరాలను మొబైల్‌యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఎండ వేడికి నెమ్మదిగా పనిచేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ నెల 15నుంచి ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకుల్లోని ఇంటింటికి తిరుగుతూ 33 అంశాలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఆందోళనచెందుతున్నారు. ప్రతి రోజు ఉదయం 7గంటల నుంచి 10గంటలవరకు మాత్రమే తమ బ్లాక్‌లోని ఇళ్ల వివరాలు యాప్‌లో నమోదు చేస్తున్నారు. పురుష ఎన్యుమరేటర్లు ఉదయం, సాయంత్రం వేళల్లో వివరాలను నమోదు చేస్తున్నప్పటికీ మహిళలు ఉదయంపూట మాత్రమే పనిచేస్తున్నారు. ఎండప్రభావంతో కేవలం రోజుకు 20 గృహాల నుంచి 25 గృహాల వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి వస్తోందని ఎన్యుమరేటర్లు పేర్కొంటున్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడంలో బ్యాంకు అనుసంధాన రుణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇకపై రుణాల మంజూరులో సభ్యుల పనితీరును ప్రామాణికంగా భావించా లని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మహిళా సంఘాల పనితీరు ఆధారంగా మార్కులు కేటా యించే పద్ధతిని తీసుకువచ్చింది. క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణ, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. అందుకోసం సెర్ఫ్‌ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.

గతానికి భిన్నంగా మార్కుల కేటాయింపు

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు గతాని కి భిన్నంగా మార్కులు కేటాయిస్తున్నారు. ఒక ఇంట్లో ఇద్దరు సభ్యులు ఉంటే సమావేశానికి ఒకరు హాజరై ఇద్దరి సంతకాలు చేసేవారు. ప్రస్తుతం అలా కుదరదు. పొదుపు సంఘాల సమావేశాల నిర్వహణ, అప్పులు వసూలు, రుణాల చెల్లింపులు తదితర సనులన్నీ పారదర్శకంగా జరగనున్నాయి. సమావేశ చిత్రాలను ప్రత్యేక పోర్టల్‌లో ఆప్‌లోడ్‌ చేయాలి. దీంతో సంఘంలో ఏం జరుగుతుందో ప్రతి సభ్యురాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. జిల్లాలో 74.7 శాతం సంఘాలు మిగిలిన సంఘాలు కూడా పనితీరును మెరుగుపరుచుకొని ‘ఏ’ గ్రేడు సాధించేలా సీసీలు, మండల సమాఖ్య అధికారులు చొరవ చూపుతున్నారు. జిల్లాలో అత్యధిక సంఘాలు ‘ఏ’ గేడులో ఉన్నాయని, మిగితావాటిని మొదటి గ్రేడు కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు వివరించారు.

కొలమానం ఇలా

జిల్లాలో స్వయం సహాయక సంఘాలు 12,468 ఉండగా 1,36,536 మంది సభ్యులున్నారు. గ్రేడింగ్‌ విధానంలో మహిళా సంఘాలకు ఎనిమిది అంశాల ఆధారంగా ఏ, బీ, సీ, డీ గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఒక్కో సంఘం 75శాతానికి పైగా లక్ష్యాలు సాధిస్తే ‘ఏ’ గ్రేడ్‌, 70–75కు ‘బీ’, 60–70కు ‘సీ’, 60శాతం కన్నా తక్కువ సాధిస్తే ‘డీ’, అంతకంటే దయనీయంగా ఉంటే ‘ఈ’ గ్రేడ్‌గా నిర్ణయిస్తారు. ఇప్పటివరకు గ్రామైఖ్య సంఘాలకు మాత్రమే గ్రేడింగ్‌ విధానం అమల్లో ఉంది. ఏ, బీ, సీ గ్రేడింగ్‌లో ఉన్న గ్రామైఖ్య సంఘాలకే సీ్త్ర నిధి రుణాలు కేటాయిస్తున్నారు. గ్రేడింగ్‌లో వెనకబడితే బ్యాంకు, సీ్త్ర నిధి రుణాలు పొందడం కష్టంగా మారనుంది.

పెరగనున్న అధికారుల పర్యవేక్షణ

గ్రేడింగ్‌ విధానం అమలులోకి రావడంతో మహిళా సంఘాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరగనుంది. ఇప్పటికే సమావేశాలకు సంబంధించి ఆక్షాంశ, రేఖాంశాలతో కూడిన లైవ్‌ ఫోటో తప్పనిసరి చేశారు. రుణ వాయిదాల రికవరీపై ప్రత్యేక దృిష్టి సారిస్తున్నారు. తరచూ సమావేశాల నిర్వహణతో రుణాల చెల్లింపులో వెనుకబడిన సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రేడింగ్‌లో ఎప్పుడు ముందుండేలా సంఘాల వారీగా అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని సమీక్షలు నిర్వహించి కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

జూలైలో ఉపాధ్యాయ బదిలీలు

కరీంనగర్‌ టౌన్‌: ఉపాధ్యాయులకు జూలైలో పదోన్నతితో కూడిన బదిలీలు ఉంటాయని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన 139 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 70 మంది మండల టాపర్లను మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ ఇప్పించే బాధ్యత తనదన్నారు. ఉపాధ్యాయులకు జూనియర్‌ లెక్చరర్లుగా, ఎంఈవోలుగా పదోన్నతులు రానున్నాయని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జైపాల్‌రెడ్డి, అబ్దుల్‌ జమీల్‌, శ్రీకాంత్‌రావు, లక్ష్మీనారాయణ, జాలి మహేందర్‌రెడ్డి, జాలి రాఘవరెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

44 డిగ్రీలు

43 డిగ్రీలు

చొప్పదండి :

ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 11 గంటల్లోగా పనులు చూసుకోవాలి. బయటకు వెళ్లాలంటే గొడుగులు, టోపీలు, తెల్లని వదులైన దుస్తులు ధరించాలి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది. వడదెబ్బ వస్తే సమీప వైద్యులను సంప్రదించాలి.

– డాక్టర్‌ వెంకటరమణ,

జిల్లా వైద్యాధికారి, కరీంనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement