సమాచారం
● పేదలకు పోషకాహారం అందేనా ? ● రైస్మిల్లుల్లో వృథాగానే మిషనరీలు ● నిలిచిన పోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తులు
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వం అందించే రేషన్ బియ్యంలో పోషకాలు మాయమయ్యాయి. ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం విరామం ప్రకటించడంతో పేదలకు బియ్యం ద్వారా పోషకాలు అందడం లేవు. చౌకధరల దుకాణాల ద్వారా ప్రతీ నెల పంపిణీ చేసే రేషన్ బియ్యంలో ఇప్పటి వరకు ఫోర్టిఫైడ్ రైస్ కలిపేవారు. ప్రతీ క్వింటాలు బియ్యానికి కిలో ఫోర్టిఫైడ్ రైస్ను కలిపి చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. తాత్కాలికంగా ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తిని ఆపేసింది. రైస్మిల్లుల్లో మార్చి 1 నుంచి ఫోర్టిఫైడ్ రైస్ లేకుండా సాధారణ బియ్యమే సంచుల్లో నింపాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు రైస్మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఫోర్టిఫైడ్ రైస్లో ఏముంటుంది ?
సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు పోషకాలు అధికంగా ఉండే ధాన్యాలను సాధారణ బియ్యంలో కలిపి అందిస్తారు. ఇందులో ఇనుము, ఫోలిక్ యాసిడ్, మిటమిన్ బీ12 ఉంటాయి. ఫోర్టిఫైడ్ రైస్ను ఎక్స్ట్రూషన్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేస్తారు. రుచిలో, బియ్యం ఉడకడంలో ఎలాంటి తేడాలు ఉండవు. ఫోర్టిఫైడ్ రైస్ను కడిగిన, వండిన పోషకాలు దెబ్బతినవు. ఫోర్టిఫైడ్ రైస్ను తినడం ద్వారా పిల్లలు, గర్భిణీలలో, బాలింతలలో రక్తహీనత ఉండదు. ఎదుగుదల లోపం లేకుండా, విటమిన్ లోపాలను అరికడుతుంది.
మిల్లర్ల పరేషాన్
పోషకాలతో కూడిన బియ్యం కస్టమ్ మిల్లింగ్ రైస్లో కలిపేందుకు రైస్మిల్లర్లు ప్రత్యేక మిషన్లను బిగించారు. ఒక్కో మిల్లులో రూ.10 నుంచి 15లక్షలు వెచ్చించి ఫోర్టిఫైడ్ బియ్యం కలిపే యంత్రాలను తీసుకొచ్చారు. ప్రతీ క్వింటాలు బియ్యానికి కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కలిపేలా యంత్రాలను సిద్ధం చేశారు. గతంలో అధికారుల ఆదేశాలతో జిల్లాలో 79 రైస్మిల్లుల్లో ఫోర్టిఫైడ్ కోసం ప్రత్యేక యంత్రాలను బిగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి కోసమే పలువురు మిల్లులను ప్రారంభించారు.
పారబాయిల్డ్ రైస్ మిల్లులు : 35
రా రైస్మిల్లులు : 44
రేషన్ షాపులు : 345
రేషన్కార్డులు : 1,95,554
లబ్ధిదారులు : 5,75,463
బియ్యం : 3,700 మెట్రిక్ టన్నులు


