వేములవాడ: హరిహర క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీసీతారామచంద్రస్వామి వారి నవరాత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో రాజన్న ఆలయంలో ఏకాంతంగా శ్రీరామనవమి ఉత్సవాలను అర్చకులు నిర్వహించారు. శ్రీరామనవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు రామాయణ పురాణ పారాయణం, ప్రవచనాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు తొమ్మిది రోజులపాటు కొనసాగనున్నాయి.
భీమన్న ఆలయంలో
శ్రీరామ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని భీమేశ్వరాలయం పక్కన ఉన్న శంకరమఠంలో నిత్యం సాయంత్రం 4 గంటలకు రామాయణ ప్రవచనం ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 27న రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలోని శివార్చన వేదికపై శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరపనున్నారు. శివపార్వతులు రాజన్నను కల్యాణం చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత. వేలాదిగా శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. వసంత నవరాత్రోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని చేశారు.
27న శివార్చన వేదికపై శ్రీసీతారాముల కల్యాణం


