చెక్డ్యాం పేల్చివేసినట్లు నిరూపిస్తే రాజీనామా
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సవాల్
కరీంనగర్ కార్పొరేషన్: పెద్దపల్లి – కరీంనగర్ జిల్లాల మధ్య మానేరుపై నిర్మించిన గుంపుల చెక్డ్యాంను పేల్చివేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల్లో నుంచి కూడా తప్పుకొంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సవాల్ విసిరారు. చెక్డ్యాం కుంగిపోయిందని తాను నిరూపిస్తానని, మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకొంటారా? అని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే గుంపుల చెక్డ్యాం నిర్మించారని అన్నారు. హుస్సేనిమియా వాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు చెక్డ్యాంలు నిర్మిస్తే కొట్టుకుపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాంలు ఇప్పటికీ చెక్కుచెదరలేదన్నారు. అసలు ఇసుక దొంగలంటేనే కేసీఆర్ కుటుంబమని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం దాచుకున్న మూడు వేల లారీల ట్రిప్పుల ఇసుక ఇప్పటికీ మానేరు తీరంలో ఉందన్నారు. అందులో సంతోష్రావు, కవిత వాటాలు లేవా? అని ప్రశ్నించారు. నేరెళ్లలో దళితులపై కేటీఆర్ థర్డ్డిగ్రీ ప్రయోగించి, జైళ్లో పెట్టించింది మరిచిపోయారా? అని నిలదీశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, నాయకులు వొడితెల ప్రణవ్, ఆరెపల్లి మోహన్, మినుపాల ప్రకాశ్రావు, అన్నయ్యగౌడ్, కల్లెపల్లి జానీ, గర్రెపల్లి సత్యనారాయణరావు, అజయ్, వెంకన్నపటేల్, సారయ్య, బుచ్చిరెడ్డి, ప్రసాద్, ఆకుల ప్రకాశ్, కాశెట్టి శ్రీనివాస్, చల్లోజు రాజు పాల్గొన్నారు.


