కాంగ్రెస్ ప్రచారంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్
కరీంనగర్ కార్పొరేషన్: అర్బన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ప్రతిష్టంభన కీలక మలుపు తిరిగింది. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ ఏ పార్టీలో ఉన్నాడో స్పష్టం చేయాలంటూ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు వర్గం చేస్తున్న డిమాండ్కు, పరోక్షంగా కర్ర సమాధానం ఇచ్చారు. ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ, తాను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో రాజశేఖర్ ప్యా నెల్ విజయం సాధించిన అనంతరం బీఆర్ఎస్, బీజేపీ అనైతిక పొత్తుతో రాజశేఖర్ ప్యానెల్ గెలిచిందని రాజేందర్రావు విమర్శించారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. వెలిచాల వర్గం ఆరోపణలు, డిమాండ్లపై నేరుగా స్పందించని రాజశేఖర్, పరోక్షంగా సమాధానం ఇచ్చారు. బ్యాంక్ అభివృద్ధిలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ల సహకారం తీసుకొంటానని చెబుతూనే, తాను మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతున్నట్లు తేటతెల్లం చేశారు.
విపక్షాల ఆశలపై నీళ్లు
స్థానిక ఎన్నికలు లేక రాజకీయ శూన్యత ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చిన అర్బన్ బ్యాంక్ ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకొన్న విపక్షాల ఆశలు అడియాసలయ్యాయి. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్కు మద్దతు ఇవ్వడం ద్వారా తాము పట్టు సాధించేందుకు బీఆర్ఎస్, ముఖ్యంగా బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం రాజశేఖర్ ప్యానెల్ విజయంపై బీజేపీ నాయకులు కాస్త ఎక్కువగానే సంబరాలు చేసుకొన్నారు. కాని తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ రాజశేఖర్ స్పష్టత ఇవ్వడం, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదు. ఏదేమైనా సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లుగానే అర్బన్బ్యాంక్లో ఈ సారి కూడా కాంగ్రెస్దే పైచేయి అయింది.


