స్కాన్ చెయ్.. రయ్రయ్..
బుకింగ్ కౌంటర్లను కొనసాగించాలి
● ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా సాధారణ టికెట్ పొందే విధానంపై
ప్రయాణికులకు అవగాహన
● వివిధ రకాల్లో టికెట్లు జారీ
● కౌంటర్లలో తగ్గించిన రైల్వే శాఖ..?
రామగుండం: క్యూఆర్ కోడ్ స్కాన్ చెయ్.. ఆన్లైన్లో క్యాష్ పే చెయ్.. జనరల్ టికెట్ పొందు.. భారత రైల్వేలో ప్రతీ ఒక్కరు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా సాధారణ టికెట్ పొందే విధానంపై ప్రతీ రైల్వే స్టేషన్లో సాధారణ ప్రయాణికులకు రైల్వే అధికారులు ఇలా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నాన్ కౌంటర్ టికెటింగ్ ఇష్యూ విధానాలను తగ్గించాలనే విషయమై సంబంధిత శాఖ అధికారులకు అంతర్గతంగా రైల్వే ఉన్నతాధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ చర్యలను గమనిస్తే రాబోయే రోజుల్లో రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లను ఎత్తివేయనున్నారా అనే అనుమానాలు ప్రయాణికుల్లో తలెత్తుతున్నాయి. పండుగలు, రైల్వే సమయానికి వచ్చే ప్రయాణికుల రద్దీ సమయాల్లో కౌంటర్లలో టికెట్ల జారీ తప్పనసరిగా ఉండాల్సిందే. దశాబ్దకాలం క్రితం రెండు సాధారణ బుకింగ్ కౌంటర్లు ఉండగా.. ప్రస్తుతం ఒకే కౌంటర్ కొనసాగిస్తూ.. యూనిఫైడ్ కౌంటర్ ఏర్పాటుతో రిజర్వేషన్/సాధారణ టికెట్ల జారీని కొనసాగించే వీలు కల్పించారు. ఇప్పటికే వివిధ రకాలుగా సాధారణ టికెట్ల జారీ విధానాలను పరిశీలిస్తే..
ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్(ఏటీవీఎం)
ఇప్పటికే ప్రతీ రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ల ప్రాంగణంలో ఏటీవీఎం యంత్రాలను ఏర్పాటు చేసి కమీషన్ పద్ధతిలో అన్ని రూట్లలో టికెట్ల జారీ విధానాన్ని ప్రయివేటు వ్యక్తులకు అప్పగించి వారితోనే పని కానిచ్చేస్తున్నారు. రైలు ప్లాట్ఫాంపై ఉన్న సమయంలో ఏటీవీఎంల వద్ద ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలోనే కౌంటర్లో జనరల్ టికెట్లను జారీ చేస్తున్నారు. వీటితోపాటు స్వయంగా ఆపరేటర్ లేకుండానే క్యూఆర్ కోడ్ సహాయంతో టికెట్ పొందే అవకాశాన్ని కూడా కల్పించారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)
ఇది 1999లోనే స్థాపించబడిన ఒక ప్రయివేటు కార్పొరేషన్. ఇది భారత రైల్వే శాఖకు తన సేవలను అందిస్తోంది. రైల్వే శాఖ సాధారణ, రిజర్వేషన్ టికెట్ల జారీ మొదలుకొని బోగీల్లో ప్రయాణికులకు ఫుడ్ సరఫరా, ఇతరత్రా సేవల బాధ్యతలను దీనికి అప్పగించింది. కొన్ని పర్యాటక, ఆధ్యాత్మిక టూర్ల నిర్వహణ, పీఎన్ఆర్ స్టేటస్–ట్రాకింగ్ విధానం, ఈ–క్యాటరింగ్, పర్యాటక సేవలు నిర్వహిస్తుంది.
అన్ రిజర్వుడు టికెటింగ్ సిస్టం(యూటీఎస్)
ఈ విధానాన్ని ఇటీవల కాలంలో రైల్వే శాఖ సాధారణ ప్రయాణికులకు స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సంబంధిత అధికారులతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ సహాయంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సాధారణ టికెట్ పొందే విధానం, సమయభావం, ఆన్లైన్ చెల్లింపులు తదితర సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్లాట్ఫాంపై బుకింగ్ కౌంటర్లను ఎత్తివేసే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి.
మొబైల్ టికెటింగ్(ఎం–టికెటింగ్)
ప్రతీ ఒక్కరు రైల్వే ప్రత్యేక యాప్ ద్వారా తమ ఆండ్రాయిడ్ ఫోన్ల సహాయంతో నిర్దేశిత సమయానికి ముందుగానే సాధారణ టికెట్ పొందొచ్చు. అదేవి ధంగా రిజర్వేషన్ టికెట్లు సైతం బుక్ చేసుకునే అవకాశముంటుంది. రైల్వే టికెట్ల జారీలో ఇప్పటికే ప లుచోట్ల ప్రత్యేక ఏజెంట్లు సైతం కొనసాగుతున్నారు.
మారుతున్న కాలానికనుగుణంగా ఆన్లైన్లో టికెట్ల జారీ విధానంపై ప్రయాణికులకు అవగాహన కల్పించడం కూడా అవసరమే. నిరక్షరాస్యులు, ఆండ్రాయిడ్ ఫోన్ లేని సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం బుకింగ్ కౌంటర్లను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– అనుమాస శ్రీనివాస్, డీఆర్యూసీసీ ప్రతినిధి
స్కాన్ చెయ్.. రయ్రయ్..


