
‘బతికే ఉన్న బాంఛన్.. ఇప్పించండి పింఛన్’
గంగాధర: ‘నేను చచ్చిపోయానని పదేళ్లుగా ఇస్తున్న పింఛన్ను ఐదు నెలలుగా ఆపేసిండ్రు. బతికే ఉన్న బాంఛన్.. నాకు పింఛన్ ఇప్పించండి’ అంటూ ఓ వృద్ధురాలు అధికారులను వేడుకుంటోంది. సదరు వృద్ధురాలి వివరాల ప్రకారం.. గంగాధర మండలం చర్లపల్లి(ఆర్) గ్రామానికి చెందిన బూర్గు లక్ష్మి భర్త చనిపోయాడు. 2014 డిసెంబర్ నెల నుంచి సర్కారు వితంతు పింఛన్ ఇస్తోంది. మే 2025 నుంచి వృద్ధురాలికి అధికారులు పింఛన్ను నిలిపివేశారు. ఈ విషయమై అధికారులను ఆశ్రయిస్తే ‘నువ్వు చనిపోయినట్లు రికార్డుల్లో ఉంది. అందుకే పింఛన్ రావడం లేదు’ అని సమాధానం ఇచ్చారు. ‘సారూ నేను బతికే ఉన్నా.. పింఛన్ ఇప్పించండంటూ’ నాలుగు నెలలుగా అధికా రుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. కలెక్టర్ స్పందించి తనకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరుతోంది.
తెలంగాణ ఆత్మ కాళోజీ
కరీంనగర్ కల్చరల్: తెలంగాణ ఆత్మ కాళోజీ అని తెలంగాణ రచయితల వేదిక (తెరవే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వేంకటేశ్వర్లు అన్నారు. తెరవే జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ప్యారడైజ్ హైస్కూల్లో 148వ ఎన్నీల ముచ్చట్లు నిర్వహించారు. ముందుగా రేకుర్తి చౌరస్తాలో కాళోజీ విగ్రహానికి నివాళి అర్పించారు. రాష్ట్ర సాధనకు కాళోజీ చేసిన కృషిని బుర్ర తిరుపతి, పీఎస్ రవీంద్ర, ఎర్రోజు వెంకటేశ్వర్లు వివరించారు. తెరవే అధ్యక్ష, కార్యదర్శులు సీవీ కుమార్, దామరకుంట సమన్వయ కర్తలుగా వ్యవహరించి, కాళోజీ స్మృతి కవితలను వినిపించారు. కవులు నడిమెట్ల రామయ్య, విలాసాగరం రవీందర్, బాలసాని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభం
జమ్మికుంట: రైతులు దళారులను నమ్మి మోసపోకుండా నేరుగా మార్కెట్ యార్డులో పత్తి విక్రయించి, మద్దతు ధర పొందాలని మార్కె ట్ కమిటీ చైర్పర్సన్ పూల్లూరి స్వప్న సూచించారు. మార్కెట్ యార్డులో మంగళవారం కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ఇల్లందకుంటకు చెందిన దాంసాని స్వామి రెండు గన్నీ సంచుల్లో పత్తిని తీసుకువచ్చాడు. గరిష్ట ధర రూ.5,021కు కొనుగోలు చేశారు. పాత పత్తి మార్కెట్కు 15 క్వింటాళ్లు రాగా.. గరిష్ట ధర రూ.7,400కు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పాల్గొన్నారు.
పవర్కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు కొనసాగుతున్నందున బుధవారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 11 కేవీ డీఎఫ్ఓ ఫీడర్ పరిధిలోని సవరన్ స్ట్రీట్, ఎస్బీఐ ప్రధానశాఖ, రాజా థియేటర్, భూంరెడ్డి ఆస్పత్రి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్–2 డిపో నుంచి ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం, సామర్లకోటలోని వివిధ దర్శనీయ ప్రాంతాలను దర్శించడానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని డిపో–2 మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఈ బస్సు 12వ తేదీ శుక్రవారం రాత్రి 10గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయల్దేరుతుందని, పెద్దలకు రూ.3300, పిల్లలకు రూ.2500 టికెట్ ఉంటుందని తెలిపారు. వివరాలకు 9398658062, 7382850708, 8978383084. నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
18 వరకు లా కోర్సుల పరీక్ష ఫీజు గడువు
కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ ఎల్ఎల్బీ నాలుగు, ఎల్ఎల్ఎం రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీని విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 18వరకు గడువు ఉందని, రూ.300 అపరాధ రుసుంతో ఈ నెల 22వరకు అనుమతించినట్లు తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ చూడొచ్చని సూచించారు.

‘బతికే ఉన్న బాంఛన్.. ఇప్పించండి పింఛన్’

‘బతికే ఉన్న బాంఛన్.. ఇప్పించండి పింఛన్’