
గెలిచే వారికే టికెట్లు
కరీంనగర్ టౌన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేవారికే టిక్కెట్లు వస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు కార్యాచరణపై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలకు టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా వారిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీజేపీలో ఏ గ్రూపు లేదని, ఉన్నదల్లా మోదీ గ్రూప్ మాత్రమేనని స్పష్టం చేశారు. తనకు గ్రూపులు ఆపాదించొద్దని, ఎవరైనా బండి సంజయ్ గ్రూప్ అని, మరో గ్రూపు వాళ్లమ ని ప్రచారం చేసుకుంటే వారికి టిక్కెట్లు రావని హెచ్చరించారు. కేంద్రం నిధులతోనే పంచా యతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న నాయకులున్న చోట వారికే టిక్కెట్లు వస్తాయని, మిగిలిన చోట్ల గెలిచే అవకాశమున్న వారిని గుర్తించాలని సూచించారు.
పెండింగ్ జీతాలు చెల్లించాలి
కరీంనగర్: ఆన్లైన్లో లేని కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేయాలని, పెండింగ్ జీతా లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో డీపీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జీపీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు రావడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్లో పేర్లు నమోదు లేవనే సాకుతో, వేతనాలు చెల్లించకుండా బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు. జీతాలు చెల్లించాలని అడిగితే విధుల్లోంచి తొలగిస్తామంటూ బెదిరించడం సరికాదన్నారు. అనంతరం డీపీవోకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎలుకపల్లి సారయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వడ్లూరి లక్ష్మీనారాయణ, కార్మికులు పార్లపల్లి రమేశ్, కండే మధునయ్య, లక్ష్మి, సరోజన, అవినాష్, నితిన్ పాల్గొన్నారు.
ఆర్టీసీ పనితీరుపై సమీక్ష
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ జోన్ పరిధిలోని రీజినల్ మేనేజర్లు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లతో కరీంనగర్లోని ఆర్టీసీ సమావేశ మందిరంలో శుక్రవారం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి పోలమన్ సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అన్ని రీజియన్ల పనితీరు, వర్షాకాలంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, రీజియన్ల నుంచి వివిధ పర్యాటక ప్రదేశాలకు నడుపుతున్న టూర్ప్యాకేజీ సర్వీసులకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణపై సమీక్షించారు. ఆర్ఎం బి.రాజు, డిప్యూటీ ఆర్ఎం(ఆపరేషన్స్)ఎస్.భూపతిరెడ్డి, డిప్యూటీ ఆర్ఎం(మెకానిక్)పి.మల్లేశం, ఆర్ఎంలు డి.విజయభాను, టి.జ్యోత్స్న, ఎస్.మధుసూధన్, ఎ.సరిరాం, వి.మల్లయ్య, ఎస్.భవానీ ప్రసాద్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విద్యానగర్(కరీంనగర్): జిల్లా పరిధిలోని ట్రాన్స్జెండర్లకు స్కిల్ డెవెలప్మెంట్ ట్రైనింగ్ కోర్సులు అందించేందుకు అర్హులైన స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి సరస్వతి తెలిపారు. దరఖాస్తులకు సంబంధిత ధ్రువపత్రాలను జతపరిచి ఈనెల 23లోగా సంచాలకులు, దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సాధికారతశాఖ, హైదరాబాద్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అదే విధంగా డ్రైవింగ్, ఫొటో, వీడియోగ్రఫీ, బ్యూటిషియన్, జూట్ బ్యాగ్ టైలరింగ్, లాజిస్టిక్స్లో శిక్షణ పొందుటకు రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్స్ నుంచి అన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి సరస్వతి తెలిపారు. ఆసక్తిగలవారు ట్రా న్స్జెండర్స్ ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 040–24559050 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.

గెలిచే వారికే టికెట్లు