ఖర్చు తక్కువ.. పోషకాలు ఎక్కువ | - | Sakshi
Sakshi News home page

ఖర్చు తక్కువ.. పోషకాలు ఎక్కువ

Jun 30 2025 4:21 AM | Updated on Jun 30 2025 4:21 AM

ఖర్చు

ఖర్చు తక్కువ.. పోషకాలు ఎక్కువ

● ప్రకృతి సేద్యం చేసే రైతుల ఎంపిక ● జగిత్యాల జిల్లాలో 2,500 మంది గుర్తింపు ● పంట ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం

జగిత్యాలఅగ్రికల్చర్‌: వ్యవసాయంలో వస్తున్న మార్పులతో పంటల్లో దిగుబడి పెరిగినప్పటికీ.. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, కలుపు మందులను పంటలపై విచ్చలవిడిగా వాడుతుండటంతో మనుషుల ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారింది. దీంతో రైతులకు రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు భారంగా తయారైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ వైపు రైతుల ఖర్చు తగ్గించడంతోపాటు మరోవైపు వినియోగదారులకు మేలైన ఆహారపదార్థాలను అందించేందుకు ప్రకృతి సేద్య పద్ధతులను పాటించాలని అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ ప్రయత్నాలు ప్రా రంభించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల దృష్టి మరల్చేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించింది. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో అవగాహన కార్యక్రమాలతోపాటు వారి తోటలను ప్రదర్శన క్షేత్రాలుగా ఎంపిక చేయనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన రైతులకు పలు విధాలుగా శిక్షణ ఇచ్చేందుకు నిధులు మంజూరు చేస్తోంది. మరోవైపు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ఎంపిక చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది.

ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం

ప్రకృతి సేద్యంతో ఓ వైపు ప్రజల ఆరోగ్యానికి భద్రత ఇవ్వడంతోపాటు మరోవైపు రైతులకు లాభం చేకూరేలా ప్రభుత్వం ప్రకృతి సేద్యం చేసే రైతులకు ప్రోత్సాహం అందించనుంది. ముఖ్యంగా సాగులో రసాయన ఎరువులను ఇబ్బడిముబ్బడిగా వాడుతుండడంతో క్యాన్సర్‌ వంటి రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు సాగుభూములు నిర్జీవంగా మారి పనికి రాకుండా పోతున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీటే వేస్తూ.. రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకర ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని చూస్తోంది. ఈ మేరకు రైతులను ఎంపిక చేసి, వారితో రసాయనాలు లేని సేంద్రియ పంటలను పండించాలని సంకల్పించింది. ఇందుకు గాను రెండేళ్లపాటు జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కార్యాచరణకు సిద్ధమైంది.

2500 మంది ఎంపిక

జగిత్యాల జిల్లాలో సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయించేందుకు ఆసక్తి గల 2500 మంది రైతులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 72 ఏఈఓ క్లస్టర్లు ఉండగా.. అందులో ప్రాథమికంగా 20 క్లస్టర్ల పరిధిలో ఈ పథకాన్ని ప్రస్తుత ఏడాది నుంచి ప్రారంభించనున్నారు. ప్రతి క్లస్టర్‌ నుంచి 125 మంది రైతులను ఎంపిక చేస్తారు. వీరికి ఎల్‌ఎన్‌ఎఫ్‌ఐ శాస్త్రవేత్తలు, మాస్టర్‌ ట్రైనర్లు, శిక్షణ పొందిన సీఆర్‌పీలు ప్రకృతి సేద్యంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి సేద్య పద్ధతులకు దేశీయ ఆవులు ప్రధానం కాబట్టి ఆవులు ఉన్న రైతులకు ఈ పథకంలో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం, ఘనామృతం, నీమాస్త్రం తయారుచేసి ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించాలన్నది ఈ పథకం ఉద్దేశం.

ప్రకృతి సేద్య స్టాళ్ల ఏర్పాటు

ప్రకృతి సేద్య పద్ధతుల ద్వారా పండించిన పంటలను మార్కెటింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా కూరగాయలు, భోజనానికి ఉపయోగించే సన్నరకం వరి పంట సాగు చేసే రైతులను తొలుత ఈ పథకంలోకి తీసుకురానున్నారు. వారు పండించిన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ఉంటే ఇతర రైతులు కూడా సేంద్రియ పద్ధతులను అనుసరించే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది.

ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను

కొన్నేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించడంతోపాటు ఈ పద్ధతిలో ఆసక్తి ఉన్న రైతులకు పలు దఫాలుగా శిక్షణ ఇచ్చాను. మామిడి, వరి పంటల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నాను. మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి.

– మిట్టపెల్లి రాములు, తుంగూర్‌

రైతులను ఎంపిక చేస్తున్నాం

సేంద్రియ వ్యవసాయ పథకం కోసం రైతులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్పత్తుల అమ్మకాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. రసాయన ఎరువులను తగ్గించి, సహజ ఉత్పత్తులు అందించాలన్నది లక్ష్యం.

– భాస్కర్‌,

వ్యవసాయ శాఖ అధికారి, జగిత్యాల

ఖర్చు తక్కువ.. పోషకాలు ఎక్కువ1
1/2

ఖర్చు తక్కువ.. పోషకాలు ఎక్కువ

ఖర్చు తక్కువ.. పోషకాలు ఎక్కువ2
2/2

ఖర్చు తక్కువ.. పోషకాలు ఎక్కువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement