బోధన వదిలి.. తనిఖీ బాధ్యతలా? | - | Sakshi
Sakshi News home page

బోధన వదిలి.. తనిఖీ బాధ్యతలా?

Jun 30 2025 4:21 AM | Updated on Jun 30 2025 4:21 AM

బోధన వదిలి.. తనిఖీ బాధ్యతలా?

బోధన వదిలి.. తనిఖీ బాధ్యతలా?

● విద్యాశాఖలో వింత నిర్ణయాలు ● వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు

కరీంనగర్‌: ‘రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తీసుకుంటున్న కొన్ని వింత నిర్ణయాలతో ఆ శాఖ ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంటుంది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం, ఫలితాలు లేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం యంత్రాంగానికి రివాజుగా మారింది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు సీనియర్‌ ఎస్జీటీ ఉపాధ్యాయులను నియమించాలనే నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యాభిమానులు వ్యతిరేకిస్తున్నారు.’

విద్యాశాఖ ఆదేశాలతో..

ప్రభుత్వ పాఠశాలలపై సరైన పర్యవేక్షణ లేక విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రులకు సర్కార్‌ బడులపై నమ్మకం సన్నగిల్లి పిల్లలను ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందు కు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరు తమ పరిధిలోని స్కూ ళ్లను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు డీఈవోకు నివేదిక ఇవ్వనున్నారు. కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసి న కమిటీతో వీరిని ఎంపిక చేయాలని పాఠశా ల విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు.

అనుభవమున్న వారికి ప్రాధాన్యత

ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసేందుకు పదేళ్ల అనుభవమున్న హెచ్‌ఎం లేదా ఎస్జీటీలను నియమించాలి. వీరు రోజూ రెండు స్కూళ్లను తనిఖీ చేయాలి. యూపీఎస్‌లకు కూడా పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌ను నియమించుకోవాలి. ఉన్నత పాఠశాలలకు పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌ను ఎంపిక చేయాలి. వీరు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల్లో 50 ఉన్నత స్కూళ్లను తనిఖీ చేయాలి. అర్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే కమిటీ వీరిని ఎంపిక చేస్తుంది.

హెచ్‌ఎంలు సహకరిస్తారా?

పర్యవేక్షణకు టీచర్లను నియమించే విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, సీఆర్పీలు ఉన్నారు. గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్ల పర్యవేక్షణలో ఉన్న హైస్కూ ళ్లను స్కూల్‌ అసిస్టెంట్లతో తనిఖీ చేయించడం సరికాదని భావిస్తున్నారు. పర్యవేక్షణకు వచ్చే వారికి హెచ్‌ఎంలు ఎంత వరకు సహకరిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మండలానికి ముగ్గురిని అధికారులుగా నియమించడం వల్ల జిల్లాలో 48 మంది పాఠశాలలకు దూరం కావాల్సి వస్తోంది. ఇలా మార్పు చేస్తే బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు.

ప్రాథమిక 426

ప్రాథమికోన్నత 76

ఉన్నత 149

మోడల్‌, కేజీబీవీలు 23

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement