
ఆటో బోల్తా.. ఒకరి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట పట్టణ కేంద్రానికి చెందిన నాగుల తిరుపతి ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేట–గొల్లపల్లి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి ఆటో బోల్తా పడడంతో తీవ్ర గాయాలైన తిరుపతిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సింగిల్విండో చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు సుభాష్, పర్షరాములు, కార్తీక్గౌడ్, ప్రదీప్, సంతోష్ పరామర్శించారు.
ట్రిమ్మర్కు చార్జింగ్ పెడుతూ.. విద్యుదాఘాతంతో..
పాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధి ముంజంపల్లి గ్రామంలో ఆదివారం విద్యుత్షాక్తో బొమ్మగాని తిరుపతి(32)మృతిచెందాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉపాధిహామీ మేట్గా విధులు నిర్వహించే తిరుపతి తన కుమారుడికి ట్రిమ్మర్తో కటింగ్ చేసేందుకు ఇంటి బాత్రూం వద్ద ట్రిమ్మర్కు చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి కింద పడిపోయాడు. అతడి భార్య రేణుక గమనించి కుటుంబసభ్యుల సాయంతో ధర్మారంలోని ప్రైవేటు ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు బసంత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదవశాత్తు కోనేరులో పడి ఒకరు..
వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న అనుబంధ ఆలయం నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి గుట్టపై కోనేరులో ప్రమాదవశాత్తు పడి సాదం రాజు(32) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భూపాల్నగర్ పందికుంటకు చెందిన సాదం రాజు ఈనెల 5న తిరుపతి, వేములవాడ దర్శనానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు రాజు బంధువు జక్కుల మహేందర్ వేములవాడకు వచ్చాడు. రాజుకు ఫోన్చేయగా లిఫ్ట్ చేయలేదు. రాజు శనివారం రాత్రి తన బంధువులకు ఫోన్ చేసి నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటానని చెప్పడంతో బంధువులు గుట్టపై గాలించారు. కోనేరు వద్ద రాజుకు సంబంధించిన బ్యాగు, చెప్పులు, పర్సు లభించాయి. దీంతో కోనేరులో వెతకగా మృతదేహం లభించింది. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేశారు.

ఆటో బోల్తా.. ఒకరి మృతి

ఆటో బోల్తా.. ఒకరి మృతి