
ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కరీంనగర్ కార్పొరేషన్: తెలంగాణ ఆవిర్భావ వేడులు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. శుక్రవారం ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశాన్ని నగరపాలకసంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించారు. నగరపాలకసంస్థ కార్యాలయంతో పాటు, కళాభారతికి లైటింగ్ వేయాలన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో పాటు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో నగరంలో చేయాల్సిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు, జయశంకర్ విగ్రహాన్ని, జంక్షన్ను పూలతో అలంకరించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో నగరపాలకసంస్థ సహాయ కమిషనర్ వేణు మాధవ్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈలు అయ్యూబ్ఖాన్, వెంకటేశ్వర్లు, ఏఈలు సతీశ్, గఫూర్ పాల్గొన్నారు.
సమీక్షతో ఒరిగిందేమీ లేదు
మానకొండూర్: జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమకుమార్రెడ్డి కరీంనగర్లో నిర్వహించిన సమీక్షతో జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు అన్నారు. మానకొండూర్లో శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజాపాలనలో లక్షలాది దరఖాస్తులు వచ్చాయని, గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కాని ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసి, స్థానిక కాంగ్రెస్ నాయకులను ఇందిరమ్మ కమిటీల్లో సభ్యులుగా నామినేట్ చేసిందన్నారు. సిబిల్ స్కోర్ ద్వారా లబ్ధిదారులకు రుణాలకు ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజీవ్ యువశక్తి కాదని కాంగ్రెస్ యువశక్తిగా మారిందన్నారు. రైతుబంధు ద్వారా ఎంతమంది రైతులకు ప్రయోజనం చేకూరిందో లెక్కలేదన్నారు. వ్యవసాయ విత్తనాలు, ఎరువుల లభ్యతపై స్పష్టత లేదన్నారు.
సమరశీల
పోరాటాలకు సిద్ధం
కరీంనగర్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఐతో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ ప్రజాసమస్యలపై ప్రజలపక్షాన సమరశీల పోరాటాలకు సిద్ధమయ్యామని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి పేర్కొన్నారు. కరీంనగర్ బద్ధం ఎల్లారెడ్డి భవన్లో శుక్రవారం జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో 16నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. బీజేపీని అడ్డుకోవాలంటే కమ్యూనిస్టులు రాజకీయ ప్రత్యామ్నాయం వైపు ఆలోచించాలన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోనే ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. సీఎం, హోం మినిస్టర్ వాడాల్సిన హెలికాప్టర్ను మంత్రులందరూ వినియోగించుకుంటూ వృథా ఖర్చు చేస్తున్నారన్నారు. జిల్లాలో సీపీఐ పార్టీని నిర్మాణపరంగా విస్తరించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పొనగంటి కేదారి, అందె స్వామి, కసిరెడ్డి సురేందర్రెడ్డి, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, కిన్నెర మల్లవ్వ, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కంది రవీందర్రెడ్డి, అందె చిన్న స్వామి, బావండ్లపల్లి యుగంధర్, మచ్చ రమేశ్ పాల్గొన్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తా
సీపీఐ జిల్లా నూతన కార్యదర్శిగా పంజాల శ్రీనివాస్ శుక్రవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్లో బాధ్యతలు స్వీకరించారు. మాజీ కార్యదర్శి మర్రి వెంకటస్వామితో పాటు నాయకులు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్యదర్శిగా తన ఎన్నికకు సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి పనిచేస్తానని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో బలము న్న చోట పోటీ చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తానని వివరించారు. అలాగే కరీంనగర్లో ఏడాదిన్నర క్రితం కేటాయించిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి