
12 నుంచి అరుణోదయ 50 ఏళ్ల స్ఫూర్తి సభలు
సిరిసిల్ల: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్) 50 ఏళ్ల పరిపూర్తి స్ఫూర్తి సభలను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 12న నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క తెలిపారు. సభ కరపత్రాలను బుధవారం హైదరాబాద్ సుందరయ్యవిజ్ఞాన కేంద్రం ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ, 1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతికి సమాఖ్య ఏర్పడిందన్నారు. 50 ఏళ్లుగా ఒక విప్లవ సాంస్కృతిక సంఘంగా ఉన్నా అరుణోదయ ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొంటూ పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్సూర్ అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల పైన జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని, ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ పోతుల, ఉపాధ్యక్షులు అనిత, రాష్ట్ర కమిటీ సభ్యులు లింగన్న, రాకేశ్, చిన్నన్న, గంగా, నూతన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాణం తీసిన ఈత సరదా
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సరదాగా ఈతకోసం వెళ్లిన అయాన్(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి గోదావరి నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. అయాన్ తల్లి డ్రులతో కలిసి గంగానగర్లో కొంతకాలంగా నివాసం ఉండేవారు. అవసరాల నిమిత్తం మూడు నెలల క్రితం కుర్మపల్లికి చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో అయాన్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో గంగానగర్లోని తన అమ్మమ్మ ఇంటికి ఇటీవల వచ్చాడు. ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఆడుకుంటానని ఇంట్లో చెప్పి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి గోదావరి నదిలోకి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలోనే నీటమునిగి చనిపోయాడు. బుధవారం అటువైపు వెళ్లిన జాలర్లకు గోదావరి నది ఫిల్టర్బెడ్ సమీపంలో శవం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి ఆస్మా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు అనూహ్యంగా నీటమునిగి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

12 నుంచి అరుణోదయ 50 ఏళ్ల స్ఫూర్తి సభలు