
ఆస్తమా వ్యాధి కాదు.. అలర్జీ మాత్రమే
కరీంనగర్టౌన్: ఆస్తమా వ్యాధి కాదని, కేవలం అలర్జీ మాత్రమేనని మెడికవర్ పల్మనాలజిస్టు డాక్టర్ రవీంద్రచారి అన్నారు. వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మంగళవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దగ్గు, ఆయాసం, అలర్జీ మాత్రమే ఆస్తమా లక్షణాలని, అంటువ్యాధి కాదని, దుమ్ము, చల్లగాలి ద్వారా మాత్రమే ఊపిరితిత్తులు రియాక్షన్ అవుతాయని పేర్కొన్నారు. ఆస్తమా వచ్చినవారు జీవితాంతం మందులు వాడాల్సిన పనిలేదని, త్వరగా గుర్తిస్తే నయం చేయడం సులువు అవుతుందని వివరించారు. ఆస్తమాకు మందులు వాడితే పిల్లలు పుట్టరనే అపోహలు ఉన్నాయని, వాటిని నమ్మవద్దన్నారు. ఆస్తమాను తగ్గించుకునేందుకు ట్యాబ్లెట్ల కంటే ఇన్హేలర్ వాడడం మంచిదన్నారు. వ్యాక్సినేషన్తో ఆస్తమాను పూర్తిగా దూరం చేయవచ్చని వెల్లడించారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రిటికల్ కేర్ నిపుణులు ఉపేందర్రెడ్డి, వైద్యులు నాగరాజు, లోకేశ్, సూపరింటెండెంట్ రవి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.