
యశోదలో అరుదైన కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్
కరీంనగర్టౌన్: సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ బదులుగా అత్యంత అరుదైన కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్ ద్వారా మహిళకు విజయవంతంగా మూడు స్టంట్లు వేసినట్లు యశోద హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ జగదీశ్ మాదిరెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్కు చెందిన విజయ వృద్ధాప్యం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెకు గుండె సమస్య రావడంతో యశోద ఆసుపత్రికి వచ్చారన్నారు. వెంటనే అంజియోగ్రామ్ చేయగా.. మూడు వాల్వ్లు బ్లాకు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమెకు బైపాస్ సర్జరీ చేయడం హైరిస్క్తో కూడుకోవడం వల్ల అత్యాధునిక కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్ ద్వారా విజయవంతంగా చికిత్స అందించినట్లు తెలిపారు. దీనికోసం ఆధునిక వైద్య పరికరాలైన ఆర్బిటల్ అథెరెక్టమీ, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ(ఓసిటీ)లను ఉపయోగించినట్లు తెలిపారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో సాంకేతికత వృద్ధి చెందుతూ అనేక మందికి జీవితాలపై ఆశను కలిగిస్తోందని తెలిపారు. హైరిస్క్ కార్డియాక్ కేసుల చికిత్సలో యశోద హాస్పిటల్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి సైతం హైదరాబాద్కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని, ఇక్కడ ప్రపంచస్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలకు సైతం పెద్ద శస్త్ర చికిత్సలు అవసరం లేకుండా పరిష్కరించుకునే వీలుంటుందని అన్నారు. పేషెంట్ విజయ మాట్లాడుతూ.. తనకు బైపాస్ సర్జరీ అవసరమైనా తన వయస్సును దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక చికిత్స అందించిన యశోద వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.