● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: గడువులోగా ఆస్తిపన్ను చెల్లించి, నగర అభివృద్ధికి సహకరించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహాత్ బాజ్పేయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరో ఆరు రోజులే గడువు ఉన్నందున ఆ లోగా పన్ను చెల్లించాలన్నారు. మంగళవారం నగరంలోని పలువురు మొండి బకాయిదారుల ఆస్తులను ఆమె సందర్శించారు. వారిపై ఒత్తిడి పెంచి పన్నులు చెల్లించేలా చేశారు. మరికొంతమందరికి హెచ్చరికలు జారీ చేశారు. నల్లా కనెక్షన్లు తొలగించారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో రెవెన్యూ విభాగంతో ఆస్తి పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పన్నులు కట్టని వారి ఇళ్లకు నల్లా కలెక్షన్లు తొలగిస్తున్నామన్నారు. నగర ప్రజలు పన్నుల వడ్డీ భారం పెంచుకోకుండా సకాలంలో చెల్లించాలని కోరారు. కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న రెండు కౌంటర్లకు గాను అదనంగా మరో కౌంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్వో భూమానందం పాల్గొన్నారు.
స్వచ్ఛ కరీంనగర్గా మార్చేందుకు సహకరించాలి
స్వచ్ఛ కరీంనగర్గా మార్చేందుకునగర ప్రజలు సహకరించాలని కమిషనర్ చాహత్ బాజ్పేయ్ కోరారు. మంగళవారం నగరంలోని వావిలాలపల్లితో పాటు పలుకాలనీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్పై అవగాహన కల్పించారు. తడిపొడి చెత్తను వేరు చేయడం, తడి చెత్తను సేంద్రియ ఎరువులుగా మార్చడం, పొడి చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు,అట్టముక్కలను డీఆర్సీ సెంటర్, ఆర్ఆర్ఆర్ సెంటర్లకు తరలించడం, స్వచ్చ సర్వేక్షణ్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించడం తదితర అంశాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేక్షన్ 2024 లో నగరపాలక సంస్థ కు మెరుగైన ర్యాకు సాధించేలా మహిళలు కృషి చేయాలన్నారు.