ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి

Mar 19 2025 12:46 AM | Updated on Mar 19 2025 12:44 AM

చిట్యాల: ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందపడి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీపూర్‌తండా గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పోతనవేన అజయ్‌కుమార్‌(24) వ్యక్తిగత పనుల నిమిత్తం చిట్యాల మండలం ఒడితల నుంచి మోరంచపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. లక్ష్మీపూర్‌ తండా గ్రామం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడంతో గాయాలపాలయ్యాడు. స్ధానికులు 108 అంబులెన్స్‌లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించగా అప్పటికే అజయ్‌కుమార్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి వీరేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్‌ వివరించారు.

ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి..

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం ఇటలీ దేశానికి వెళ్లిన ఓ వలస జీవి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన స్వగ్రామం ఎల్లారెడ్డిపేటలో విషాదం నింపింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మహమ్మద్‌ రషీద్‌(47) రెండేళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. కారు డ్రైవింగ్‌ చేస్తుండగా ప్రమాదానికి గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయం అక్కడి మిత్రులు కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా మంగళవారం సమాచారం అందించారు. రషీద్‌ కుటుంబ సభ్యులు కొంతకాలంగా సిద్దిపేటలో ఉంటున్నారు. రషీద్‌ మృతదేహం బుధవారం ఎల్లారెడ్డిపేటకు రానుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నీటి సంపులో పడి బాలుడు..

సైదాపూర్‌: మండలంలోని ఎలబోతారంలో మంగళవారం రెండేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన ఎలబోయిన సురేశ్‌–చైతన్య దంపతులకు కుమారుడు ప్రజ్ఞాన్‌ (2) ఉన్నాడు. ఎప్పటిలాగే ఇంటిపక్కన ఆడుకుంటుండగా నీటి సంపులో పడి మృతిచెందాడు. ప్రజ్ఞాన్‌ మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు.

భార్య కోసం అర్ధనగ్న నిరసన

హుజూరాబాద్‌: తన భార్యను కాపురానికి పంపడం లేదని ఓ యువకుడు అర్ధనగ్నంగా నిరసనకు దిగాడు. ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మంగళవారం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘర్షనగర్‌కు చెందిన గుంజే రాజుకు హుజూరాబాద్‌కు చెందిన సంపంగి దుర్గయ్య– నీలమ్మ కూతురుతో వివాహం జరిగింది. అయితే తన భార్యను కాపురానికి పంపడం లేదని, ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ.. హుజూరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై అర్ధనగ్నంగా బైఠాయించాడు. ఏఎస్‌ఐ కమల, పోలీసులు నచ్చచెప్పినా.. వినలేదు. బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి 1
1/3

ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి

ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి 2
2/3

ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి

ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి 3
3/3

ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement