
మాట్లాడుతున్న కలెక్టర్ బి.గోపి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ బి.గోపి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంపీడీవోలు, వ్యవసాయ, ఉద్యానవన, బ్యాంకు అధికారులతో ఆయిల్పాం, ఎరువులు, రుణమాఫీపై సమీక్షించారు. ఆయిల్ పాం సాగును క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు తీసుకువెళ్లడానికి సరిపడా ఉద్యానవనశాఖ సిబ్బంది లేనందున, ఏఈఓలు తమవంతు సహకారాన్ని అందించాలని అన్నారు. జిల్లాలో 5 ఎకరాలకు పైబడిన 10వేల మంది రైతులకు చెందిన 76వేల ఎకరాల నుంచి 12,800 లక్ష్యం మేర ఆయిల్ పామ్ సాగుచేయించాలని అన్నారు. పంట సాగుపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి అవగాహన సదస్సులను నిర్వహించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఒకరోజు ముందు టాంటాం చేయించాలన్నారు. ఒక్కో వ్యవసాయ విస్తరణ అధికారి వచ్చే గురువారం నాటికి రైతులను గుర్తించాలని సూచించారు. 2018 డిసెంబర్11 నాటికి ఏదైనా బ్యాంక్ నుంచి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఏవో శ్రీధర్, ఎల్డిఎం ఆంజనేయులు, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో శ్రీలత, ఉద్యాన అధికారి ప్రతాప్ పాల్గొన్నారు.