
● ఒక్కో కేంద్రంలో కుటుంబం ఓట్లు ● తుది జాబితా పక్కాగా రూపొందేనా ● కొత్త దరఖాస్తులు 42,725
‘నగరంలోని మంకమ్మతోటలో భూపతి మల్లారెడ్డి– సునీత గత 40ఏళ్లుగా నివసిస్తున్నారు. పోలింగ్ కేంద్రం 356 కాగా ఓటరు జాబితాలో సునీత పేరు ఉండగా.. మల్లారెడ్డి పేరును తొలగించారు. గతంలో పలుమార్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినా అధికారుల అత్యుత్సాహంతో
మల్లారెడ్డికి ఓటు లేకుండా పోయింది’.
‘బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యనేత ఇంట్లో నాలుగు ఓట్లు ఉండగా ఒక్కొక్కరిది ఒక్కో పోలింగ్ కేంద్రంలో చూపిస్తోంది. ఎన్నికల సంఘం కుటుంబ సభ్యులందరి ఓట్లను ఒకే పోలింగ్ కేంద్రంలో చేర్చాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే’.
‘నగరంలోని విద్యానగర్ సమీపంలోని హిందూపురికాలనీకి చెందిన రమేశ్ ఇంటి నంబర్ 10–3–346 కాగా.. వీరింట్లో 5 ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో పోలింగ్
కేంద్రం. ఒకే కుటుంబం 371, 370, 363, 289, 369 నంబర్లు గల పోలింగ్ కేంద్రాల్లో
ఓటేయాలన్న మాట’.
కరీంనగర్ అర్బన్:
అర్హత గల ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలని, కుటుంబంలోని ఓటర్లందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలోకి చేర్చాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసినా సిబ్బంది నిర్లక్ష్యం ఓటర్లకు శాపంగా మారింది. ఇంట్లో నుంచి కదలకుండా జాబితాను రూపొందించారన్న ఆరోపణలు వ్యక్తమవుతుండగా రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింట ఓటరు సర్వే, ప్రత్యేక క్యాంపెయిన్ తదితర కార్యక్రమాలు నిర్వహించినా అవే సమస్యలు వెంటాడటం అధికారుల పనితీరుకు తార్కాణం. నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కాగా జిల్లావ్యాప్తంగా ఎలా ఉందో మరీ.
ఎందుకీ నిర్లక్ష్యం
గత నెల 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించగా అంతకు రెండు నెలల ముందు నుంచే ఓటరు జాబితాపై ఇంటింటి సర్వే నిర్వహించారు. ఒకే ఇంటి నంబర్పై ఎక్కువగా ఓట్లున్న వాటిని గుర్తించగా వలసవెళ్లినవారు, మరణించినవారి పేర్లను తొలగించారు. బీఎల్వోలుగా వ్యవహరించినవారిలో హెచ్చు మంది విధులను నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రత్యేక క్యాంపెయిన్లోనూ పలువురు డుమ్మా కొట్టారని తెలుస్తోంది. అత్యంత పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించాల్సి ఉండగా ఇల్లు, కార్యాలయంలోనే సర్వే చేసి మమ అనిపించారు. కాగా ఈ నెల 19వరకు ఓటరు నమోదు, అభ్యంతరాలకు అవకాశమివ్వగా 61,048 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తులు, అభ్యంతరాలపై అక్టోబర్ ఒకటి వరకు పరిశీలించి అదే నెల 4న తుది జాబితా ప్రకటించనున్నారు. అయితే జాబితా పక్కాగా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దరఖాస్తుల పరిశీలన పక్కాయేనా..?
ప్రత్యేక క్యాంపెయిన్ నాలుగు రోజులు నిర్వహించగా అధికారులు జూనియర్, డిగ్రీ కళాశాలలు, వృత్తివిద్యా కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కొత్త ఓటరు నమోదుకు 42,725 దరఖాస్తులు రాగా కరీంనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 14,779, హుజూరాబాద్లో అత్యల్పంగా 7,770 దరఖాస్తులు వచ్చాయి. కాగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కాగా కరీంనగర్ నియోజకవర్గంలో 268 దరఖాస్తులను తిరస్కరించారు. కొత్త దరఖాస్తుల్లో 7,288 పెండింగ్లో ఉండగా మార్పులకు సంబంధించి ఫారం–8 దరఖాస్తులు 1942, అభ్యంతరాలు, తొలగింపులకు సంబంధించి ఫారం–7కు 2100 ఆర్జీలు ఇంకా పరిశీలించాల్సి ఉంది. అలాగే చొప్పదండిలో ఫారం–6కు సంబంధించి 2797, ఫారం6ఎ 2, ఫారం7 6071, ఫారం8 1591, మానకొండూరుకు సంబంధించి ఫారం6 3017, ఫారం7 1939, ఫారం8 1318, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఫారం6 2336, ఫారం7 2913, ఫారం8 1668 దరఖాస్తులు ఇంకా పరిశీలించాల్సి ఉంది.
జిల్లాలో వచ్చిన దరఖాస్తులు: 72,146
కొత్త ఓటరుకు: 42,728
అభ్యంతరాలు: 15,640
మార్పులు: 13,778