స్థానికంలోనూ త్రిముఖమే | - | Sakshi
Sakshi News home page

స్థానికంలోనూ త్రిముఖమే

Dec 12 2025 6:43 AM | Updated on Dec 12 2025 6:43 AM

స్థానికంలోనూ త్రిముఖమే

స్థానికంలోనూ త్రిముఖమే

స్థానికంలోనూ త్రిముఖమే

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలో రాజకీయ ముఖచిత్రం విడతలవారీగా మారుతూ వస్తోంది. గతంలో రెండు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే ముఖ్యంగా పార్లమెంట్‌, అసెంబ్లీ, జిల్లా ప్రజాపరిషత్‌, మండల ప్రజా పరిషత్‌, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నువ్వా నేనా అనేవిధంగా పోటాపోటీ ఉండేది. అయితే గత ఆరేడు సంవత్సరాల కాలంలో ముఖాముఖి పోటీ బదులు త్రిముఖ పోటీ నెలకొంటోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్‌–టీడీపీ, కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య పార్లమెంట్‌, శాసనసభ, పరిషత్‌, పంచాయతీ ఎన్నికల్లో పోరు నడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక మాత్రం ఉమ్మడి ఇందూరు జిల్లాలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలతో బీజేపీ ఢీకొడుతూ వస్తోంది. ఈ క్రమంలో బీజేపీ గత రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో (2019, 2024) వరుసగా విజయకేతనం ఎగురవేసింది. అయితే శాసనసభ, స్థానిక ఎన్నికల విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ప్రభావం చూపుతూ వచ్చింది. ఇదిలా ఉండగా గత శాసనసభ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేనవిధంగా బీజేపీ ఉమ్మడి జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాలను గెలుచుకోవడంతో పాటు కామారెడ్డిలో అయితే ఏకంగా కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలనే బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడించడం గమనార్హం. ఇతర నియోజకవర్గాల్లోనూ పార్టీ గణనీయమైన స్థాయిలో ఓట్లు సాధించింది. మరోవైపు గత మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి మేయర్‌ పీఠం దిశగా పావులు కదుపుతోంది. ఇతర మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. క్రితంసారి ఎన్నికల్లో జిల్లాలో అక్కడక్కడా జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలుచుకున్నప్పటికీ గ్రామ పంచాయతీల విషయంలో బీజేపీ నామమాత్రంగానే పోటీ ఇచ్చేది. అయితే గతంలో ఎన్నడూ లేనవిధంగా ప్రస్తుతం పంచాయతీ పోరులో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ తరువాత బీఆర్‌ఎస్‌తో సమానంగా జిల్లాలో బీజేపీ పంచాయతీల్లో పోటీ చేస్తోంది. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో కీలక పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. రెండు, మూడు విడతల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో పంచాయతీలను కై వసం చేసుకునేందుకు బీజేపీ శ్రేణులు పోరాడుతున్నాయి.

దీంతో ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల్లో త్రిముఖ పోరు నడుస్తున్నట్లు స్పష్టమైంది. పంచాయతీ పోరులోనే త్రిముఖ పోరు ఉంటే రానున్న పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో హోరాహోరీ త్రిముఖ పోరు తప్పదని రాజకీయ, ఇతర వర్గాల్లో చర్చ నడుస్తోంది.

పార్లమెంట్‌, అసెంబ్లీ మాదిరిగా

పోటాపోటీ

కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌

అభ్యర్థుల హోరాహోరీ

రానున్న పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో

త్రిముఖ పోరు తప్పదనే చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement