మేమేమి పాపం చేశాం..?
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
రేషన్ కార్డు మంజూరు చేయండి
లింగంపేట(ఎల్లారెడ్డి): తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు లేని కుటుంబాలు నేటికీ ఎన్నో ఉన్నాయి. పాలకులు, అధికారుల కళ్ల ముందు కనిపిస్తున్నా కనికరించకపోవడం విశేషం. కూలీ నాలీ చేసుకుంటూ, నాలుగు ఇళ్లలో అడుక్కుంటూ జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో... వారికి ఉండడానికి ఇల్లు ఉండదు.. కట్టుకోవడానికి బట్టలు సరిగా ఉండవు. వృద్ధాప్యం వస్తున్నా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయదు. కనీసం రేషన్ కార్డు అయినా ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్న బతుకులు ఎన్నో. అనర్హులకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇల్లు వస్తున్నాయి, కాని అర్హులమైనా మేము ఏం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండకూ, వానకూ, చలికి వణుకుతూ ప్రతీ రోజు నరకయాతన అనుభవిస్తూ రోడ్డు పక్కన, సగం నిర్మాణం చేసి వదిలేసిన భవన నిర్మాణాల స్లాబుల కింద జీవనం కొనసాగిస్తూ అభాగ్యులు చాలా మంది ఉన్నారు. పాలకులకు ఎన్నికలు రాగానే పేదలు గుర్తుకు వస్తారు. అధికారులకు తమ పనులు చేసుకోవడానికే సమయం సరిపోదు. పేదవారి ఆకలి ఎలా తెలుస్తుంది. కనీసం పేదవారికి రేషన్ కార్డు అయినా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు.
కటికె లింగోజి దీనగాథ..
లింగంపేట మండల కేంద్రంలో రెండు కుటుంబాలు గ్రంథాలయం పక్కన ఉన్న అంగన్వాడీ భవనం కోసం స్లాబు వేసి వదిలి పెట్టిన దాని కింద ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారు. మండల కేంద్రానికి చెందిన కటికె లింగోజి దీనగాథ ఇలా ఉంది. లింగోజి భార్య మంగూబాయి 20 సంవత్సరాల క్రితం ముగ్గురు కూతుర్లకు జన్మనిచ్చింది. ముగ్గురు పిల్లలు పుట్టినా ఆరు నెలల వ్యవధిలోనే మృతి చెందారు. తర్వాత కామెర్ల వ్యాధితో ఆమె మృతి చెందింది. అప్పటి నుంచి లింగోజి ఒంటరి వాడయ్యాడు. ప్రస్తుతం లింగోజికి 60 ఏళ్లు పైబడ్డాయి. రెండేళ్లుగా పింఛను కోసం అధికారులకు పలుమార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు. 20 ఏళ్లుగా దీన స్థితిలో బతుకుతున్నాడు. కూలి పనులు చేసుకుందామన్నా చేతకావడం లేదు. వాళ్ల, వీళ్ల చేతికింద పనులు చేసుకుంటూ వాళ్లు ఇచ్చిన డబ్బులతో బియ్యం కొనుక్కొని వంట చేసుకొని తింటున్నాడు. అధికారులు స్పందించి కనీసం రేషన్ కార్డు, పింఛను మంజూరు చేయాలని కోరుతున్నాడు.
ఉండడానికి ఇల్లు లేక నాలుగేళ్లుగా కిరాయి ఇళ్లలో జీవించాం. కిరాయికి డబ్బులు ఎల్లక అంగన్వాడీ స్లాబు కింద నివాసం ఉంటున్నాం. వానకు తడిసి, ఎండకు ఎండి, చలికి వణుకుతూ చాలా కష్టంగా బతుకుతున్నాం. అధికారులు తమపై కనికరించి నా కూతురు, భర్తకు పింఛన్లు మంజూరు చేయాలి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే ఇల్లు కట్టుకుంటాము.
– తుపాకుల కమల, లింగంపేట
ఒక్క పూట కడుపు నిండా తినలేకపోతున్నాను. బియ్యం లేక ఒక్కోసారి అడుక్కొని తినాల్సి వస్తోంది. రేషన్ కార్డు లేదు. 65 సంవత్సరాల వయస్సు వచ్చింది. పని చేసుకోలేకపోతున్నాను. పింఛను రావడంలేదు. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. రేషన్ కార్డు, పింఛను మంజూరు కాలేదు. అధికారులు, పాలకులు స్పందించి మంజూరు చేయండి. – కటికె లింగోజి, లింగంపేట
అర్హత ఉన్నా అందని పింఛన్లు,
ఇందిరమ్మ ఇళ్లు
అంగన్వాడీ స్లాబుల కిందే
నిరుపేదల జీవనం
ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ
తిరుగుతున్నా స్పందన కరువు
మేమేమి పాపం చేశాం..?
మేమేమి పాపం చేశాం..?


