
జార్ఖండ్లో అబ్బాపూర్తండావాసి మృతి
● మృతుడు పోస్టల్ ఉద్యోగి
నవీపేట: మండలంలోని అబ్బాపూర్ తండాకు చెందిన సభావాత్ శ్రీహరి(20) సోమవారం జార్ఖండ్లో జరిగిన నీటి ప్రమాదంలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్బాపూర్ తండాకు చెందిన సభావత్ కై లాస్ కుమారుడు జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ఫూల్ పరిధి ఒటాదిరి బ్రాంచ్లో పోస్టల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆయన స్నేహితులతో కలిసి సమీపంలోని వాటర్ఫాల్కు వెళ్లాడు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి నీటమునిగాడు. ఊపిరాడకపోవడంతో మృతి చెందాడు. జార్ఖండ్ పోలీసులు మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రీహరి మృతితో అబ్బాపూర్తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పాము కాటుతో ఒకరు..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల మొగులయ్య(59) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. మొగులయ్య ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఏదో కుట్టినట్లు తెలియడంతో నిద్ర నుంచి మేల్కొని పరిశీలించగా పాము కనిపించింది. కుటుంబసభ్యులకు తెలపడంతో పామును చంపేసి మొగులయ్యను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు మొగులయ్య మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కామారెడ్డి క్రైం: అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వస్తూ దారి మరిచి తప్పిపోయిన చిన్నారిని పట్టణ పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని ఆర్బీనగర్ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన తూర్పాటి లక్ష్మి–చింటులకు 4 ఏళ్ల కుమార్తె సాయిపల్లవి ఉంది. ఆమె ప్రతిరోజు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి ఉదయం 10 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి వచ్చేది. సోమవారం ఇంటికి వస్తుండగా దారి తప్పి ఎక్కడికో వెళ్లిపోయింది. బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, అంగన్వాడీ కేంద్రం సిబ్బంది గాలించడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిరిసిల్లా రోడ్డులోని యూనియన్ బ్యాంకు వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ బాలికను చేరదీసి పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చాడు. పట్టణ ఎస్హెచ్వో నరహరి కుటుంబసభ్యులకు సమాచారం అందించి చిన్నారిని అప్పగించారు.

జార్ఖండ్లో అబ్బాపూర్తండావాసి మృతి