
మన విశ్వాసం.. సంప్రదాయం.. పసుపు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భారతీయులకు శుభప్రదమైన పసుపు మసాలా కాదని.. మన విశ్వాసం, సంప్రదాయమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్షా అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ఆదివారం ప్రారభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందూరు రైతుల పోరాటం గుర్తించి, రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ఇదే జిల్లాకు చెందిన రైతుబిడ్డ పల్లె గంగారెడ్డికి చైర్మన్ పీఠం ఇచ్చామన్నారు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటుతో నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. మంగళదాయకమైన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్గా పనిచేసే పసుపును భారతీయులు వేల ఏళ్లుగా వంటల్లో వాడుతున్నారన్నారు. పాశ్చాత్యులు మాత్రం క్యాప్సుల్స్ రూపంలో తీసుకుంటున్నారన్నారు. బోర్డు ద్వారా రైతులే అంతర్జాతీయ ఎగుమతులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ కోఆపరేటీవ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు భారత్ ఆర్గానిక్ కో ఆపరేటీవ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ సంస్థలను నెలకొల్పిందని, నిజామాబాద్లో ఈ సంస్థల శాఖలను ఏర్పాటు చేస్తామన్నారు. 2030కల్లా అంతర్జాతీయ స్థాయిలో బిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగు మతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ (సీతక్క), ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, రాష్ట్ర కోఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాస మేణుగోపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇందూర్లో భారత్ ఆర్గానిక్
కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ బ్రాంచ్
పసుపు బోర్డు కార్యాలయం
ప్రారంభం.. లోగో ఆవిష్కరణ
సమావేశంలో అమిత్షా