
‘నాణ్యమైన భోజనాన్ని అందించాలి’
మాచారెడ్డి : విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సూచించారు. శుక్రవా రం ఆయన మాచారెడ్డిలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, పీహెచ్సీని పరిశీలించారు. మహిళా సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ సర ళ, ఎంపీడీవో గోపిబాబు, ఏపీవో సాయిబా బా, ఎంపీవో సురేందర్, ఏపీఎం శ్రీనివాస్, బీసీ హాస్టల్ వార్డెన్ చక్రధర్ ఉన్నారు.
‘కేజీబీవీలో నూతన కోర్సులు ప్రారంభం’
రాజంపేట : మండల కేంద్రంలోని కేజీబీవీ లో ఇంటర్లో ఫార్మా టెక్నాలజీ, కమర్షియల్ గార్మెంట్స్ టెక్నాలజీ కోర్సులను ప్రారంభించారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డీఈవో రాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం పా ఠశాల ఆవరణలో సరస్వతి మాత విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, జీఈసీవో సుకన్య, ఎంపీడీవో రఘురాం, త హసీల్దార్ జానకి పాల్గొన్నారు.
సిట్ ముందు వాంగ్మూలం
ఇచ్చిన దేవరాజ్ గౌడ్
కామారెడ్డి క్రైం/కామారెడ్డి టౌన్: ఫోన్ ట్యా పింగ్ కేసులో డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్ శుక్రవారం వాంగ్మూలం ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలోని పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు సిట్ విచారణలో తేలిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో దేవరాజ్ గౌడ్ ఒకరు. సిట్ అధికారులు ఫోన్ చేసి ఆయనను వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. దీంతో ఆయన శుక్రవా రం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని సిట్ అధికారులను కోరానన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, రామా గౌడ్, నంద రమేశ్, దర్శన్, రాజు ఉన్నారు.
సీఎం ప్రజావాణి ఫిర్యాదుల
పరిష్కారంలో జిల్లాకు గుర్తింపు
కామారెడ్డి క్రైం : పోలీసు శాఖకు సంబంధించిన సీఎం ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కా రంలో జిల్లా మంచి పనితీరుతో గుర్తింపు తెచ్చుకుందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ కార్యాలయం నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ జితేందర్ ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించారు. ఇందులో కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో లేకపోవడంతో జిల్లా నోడల్ అధికారి ఏఎస్పీ నరసింహారెడ్డికి ప్రశంసాపత్రం అందించారని ఎస్పీ తెలిపారు.
ఎస్సెస్సీ సప్లిమెంటరీలో 90.67 శాతం ఉత్తీర్ణత
కామారెడ్డి టౌన్ : ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. జిల్లాలో 675 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 612 మంది పాస్ అయ్యారు. 90.67 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 422 మంది పరీక్ష రాయగా 376 మంది, బాలికలు 253 మందికిగాను 236 మంది పాసయ్యారని డీఈవో రాజు తెలిపారు.

‘నాణ్యమైన భోజనాన్ని అందించాలి’