
సర్కారు బడిలో సాంకేతిక పాఠాలు
నస్రుల్లాబాద్(బాన్సువాడ): ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) పాఠాలు వేగవంతం చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 5 పాఠశాలలో ప్రత్యేక తరగతుల నిర్వహణ జరుగుతోంది. ఇంకో వైపు ప్రభుత్వం 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలలకు 5 కంపూటర్లు మంజూరు చేయాలని నిర్ణయింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో దాదాపు 800పైగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 214 పాఠశాలల్లో 50 మందికిపైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
ఏఐ బోధనతో కంప్యూటర్పై అవగాహన..
ఏఐ వినియోగంతో ప్రాథమిక దశలోనే విద్యార్థులకు కంప్యూటర్లపై అవగాహన కలుగనుంది. కంప్యూటర్ విద్యపై భయం తొలగనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన సాంకేతిక బోధనతో విద్యార్థులు చతుర్విద ప్రక్రియలు నేర్చుకుంటున్నారు. తొలిసారిగా ఏడు పాఠశాలల్లో కంప్యూటర్లతో పాఠాలు నేర్చుకునే అవకాశం దక్కింది. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్లో పదాలు, వాక్యాలు, కూడికలు, తీసివేతల సామర్థ్యాలను అంచనా వేసి కేటగిరీలుగా విభజించారు. ఒక్కో విద్యార్థికి రోజుకు 20 నిమిషాలు చొప్పున వారంలో నాలుగు రోజులు ఏఐ పాఠాలు నేర్చుకునే అవకాశమిస్తున్నారు. అంతే కాకుండా ఏఐ విద్యను రెండు రకాలుగా బోధించనున్నారు. జిల్లాలో 27 పాఠశాలలో ఏఐ ద్వారా తెలుగు, గణితం బోధించడం ఓ పద్దతి అయితే గణితంను ఛాప్టర్–5 గా సిలబస్లో భాగంగా నేర్పించడం రెండో పద్ధతిగా బోధకులు చెబుతున్నారు.
ఐదు పాఠశాలల ఎంపిక..
జిల్లాలో ఏఐ కంప్యూటర్ విద్యకోసం పైలట్ ప్రాజెక్టు కింద ఐదు పాఠశాలలను ఎంపిక చేశారు. శెట్పల్లి, కోమలంచ, బోర్లం, రామారెడ్డి, బావాపూర్ ఎంపీపీఎస్లను ఎంపిక చేసి ఏప్రిల్ 21 నుంచి విద్యనందిస్తున్నారు.
50 మంది విద్యార్థులు ఎక్కువున్న
స్కూళ్లకు 5 కంప్యూటర్లు
ఈ విద్యా సంవత్సరం నుంచే ఏఐ విద్య
పైలట్ ప్రాజెక్టుగా
5 పాఠశాలల్లో ప్రారంభం
జిల్లాలో 214 పాఠశాలల
విద్యార్థులకు మేలు
పాఠాలు సులువుగా నేర్చుకోవచ్చు
ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఏఐ ద్వారా పాఠాలు బోధించడం ద్వారా గణితం, ఆంగ్లం, కోడింగ్, డీకోడింగ్లను విద్యార్థులు సులభంగా నేర్చుకోవచ్చు. దీని వల్ల క్రమం తప్పకుండా విద్యార్థులు పాఠశాలలకు వస్తారు. అంతే కాకుండా చిన్నతనంలోనే కంప్యూటర్పై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో కంప్యూటర్ విద్య అలవాటుగా మారుతుంది.
– అయ్యాల సంతోష్,
ఉపాధ్యాయుడు, బోర్లం
ఏప్రిల్ 21 నుంచి ప్రారంభించాం
విద్యార్థులకు ఏఐ ద్వారా విద్యను నేర్పించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పైలెట్గా 5 పాఠశాలలో ఏప్రిల్ 21 నుంచి ప్రారంభించాం. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి పాఠశాలలో ప్రారంభించడానికి పనులు సాగుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాం. మరి కొన్ని రోజుల్లో కంప్యూటర్ విద్య ప్రారంభమవుతుంది. – వేణుగోపాల్,
అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, కామారెడ్డి

సర్కారు బడిలో సాంకేతిక పాఠాలు

సర్కారు బడిలో సాంకేతిక పాఠాలు