
బాన్సువాడలో సైబర్ మోసం
బాన్సువాడ: బాన్సువాడ సైబర్ మోసం చోటు చేసుకుంది. బాన్సువాడ సీఐ అశోక్ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని అర్ఫత్ కాలనీకి చెందిన సయ్యద్ రఫీ బ్యాంకు ఖాతా నుంచి ఈనెల 5న రెండుసార్లు రూ.20 వేలు కట్ అయ్యాయి. మరుసటి రోజు రఫీ బంధువు తన ఖాతాకు రూ. లక్ష 30వేలు వేసాడు. 6న సాయంత్రం వరకు రూ. లక్ష 30వేలు రఫీ ఖాతాలోనే ఉండడంతో 7న మరొకరి రూ. లక్ష ఫోన్పే చేద్దామని చూడగా అప్పటికే రూ. లక్ష కట్ అయ్యాయి. దీంతో అనుమానం వచ్చి రఫీ బ్యాంకుకు వెళ్లగా పోలీసులను ఆశ్రయించాలని బ్యాంకు ఉద్యోగులు సూచించారు. దీంతో అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఉత్తమ విద్యార్థులకు సన్మానం
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని స్థానిక షాదీఖానాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కామారెడ్డి జిల్లా నాయక్పోడ్ సామాజిక వర్గం విద్యార్థులను ఆదివారం నాయక్పోడ్ ఉద్యోగ సంఘం నాయకులు సన్మానించారు. ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 27 మందిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిలు, నేతలు పెంటయ్య, వెంకట్, బాలు, సంజీవు, బాల్రాజు తదితరులు పాల్గొన్నారు.