చలానా సొమ్ము తిరిగొచ్చేదెప్పుడో?
● రిజిస్ట్రేషన్ రద్దయినా తిరిగి రాని సొమ్ము
● ఐదేళ్లుగా పెండింగ్లో..
● ఉమ్మడి జిల్లాలో రూ. 10 కోట్లపైనే బకాయిలు
దోమకొండ: ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం చలానాల రూపంలో డబ్బులు వసూలు చేస్తుంది. అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ రద్దయితే దరఖాస్తుదారుకు ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఐదేళ్లుగా డబ్బులు వాపస్ రావడం లేదు. దీంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పది సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నిజామాబాద్ అర్బన్తో పాటు నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్, కామారెడ్డి, బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఏదైనా కారణాలతో రిజిస్ట్రేషన్ రద్దయితే దరఖాస్తుదారుకు తిరిగి డబ్బులను వారి బ్యాంకు అకౌంట్లో వేయాల్సి ఉంటుంది. అయితే ఐదేళ్లుగా ఈ డబ్బులు తిరిగి రావడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 650 మందికి సంబంధించి రూ. 10 కోట్లకుపైగా రావాల్సి ఉంది.
చలానాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోనివారు తమ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారి వివరాలను తీసుకుని బిల్లులు చేసి సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా ట్రెజరీకి పంపిస్తారు. కాగా ట్రెజరీ కార్యాలయానికి పంపిన బిల్లులు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. మళ్లీ బిల్లులు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే డబ్బులు విడుదల చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
మా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన స్థలాన్ని మా కుమారుడి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయడానికి దోమకొండలో ఏడాది క్రితం చలానా కట్టాను. తర్వాత నా పేరుమీద చాలానా తీసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నా కుమారుడి పేరు మీద కట్టిన చలానా డబ్బులు రూ.9,600 రావడానికి ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలని అధికారులు అడిగారు. దరఖాస్తు రాసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇచ్చాను. ఏడాది దాటినా ఇంతవరకు డబ్బులు తిరిగి రాలేదు.
– బొమ్మెర శ్రీనివాస్, దోమకొండ


