
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
దోమకొండ : భూ సమస్యల పరిష్కారానికే ప్రభు త్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ ఆ శిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం సంఘమేశ్వర్లో నిర్వహించిన భూభారతి సదస్సులో ఆ యన పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల దరఖాస్తులకు సంబంధించిన భూ వివరాలను రెవెన్యూ రికార్డులలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులన్నింటిని కచ్చితంగా ఆన్లైన్లో పొందుపరిచాలని, ఆలస్యం చేయకుండా అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి అన్ని రకాల భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని తహసీల్దార్ సుధాకర్తో పాటు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. ఇంకా ప్రారంభించని వారితో మాట్లాడి ఇళ్లు నిర్మించుకునేలా చూడాలని ఎంపీడీవో ప్రవీణ్కుమార్ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా, లబ్ధిదారులు ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.
విద్యా సంస్థలను సిద్ధం చేయాలి
విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం దోమకొండ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాల, వసతి గృహం, భోజనశాల, స్టోర్ రూం, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో మొక్కలను నా టారు. గురువారంనుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నందున వెంటనే ఆవరణతోపాటు గదులను శుభ్రం చేయించాలని, వాటర్ ట్యాంకులను కడిగించాలని ఆదేశించారు. భోజనానికి ఉపయోగించే సరుకులను నాణ్యమైనవే వాడాలని కళాశాల ప్రిన్సిపాల్ చైతన్యకు సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జ్యోతి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల జోనల్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు, ఎంపీడీవో ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు..
కామారెడ్డి క్రైం : ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు స రఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సంగ్వాన్ తెలిపారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హర్ ఘర్ జల్ కార్యక్రమం కింద జరుగుతున్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ వెబ్సైట్లో ఉన్న జిల్లాలోని 953 ప్రభుత్వ పాఠశాలలతో పాటు 1,095 అంగన్వాడీ కేంద్రాలు, జిల్లాలోని 423 రెవెన్యూ గ్రామాలలో శుద్ధమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. అన్ని వివరాలను జల్ జీవన్ మిషన్ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి