
తాళం వేసిన ఇంట్లో చోరీ
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మన్నె అంజవ్వ, కుటుంబ సభ్యులు నాలుగు రోజుల కిందట ఇంటికి తాళం వేసి, హైదరాబాద్ వెళ్లారు. కాగా మంగళవారం రాత్రి వారు ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతోపాటు బీరువా తెరచి ఉండటం గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఇన్చార్జీ ఎస్సై రాజు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచిన 40 తులాల వెండి అభరణాలు, రూ. 25వేల నగదును ఎత్తుకువెళ్లినట్లు తెలిపారు. ఈమేరకు బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మోటార్ కేబుల్ వైరు..
భిక్కనూరు: మండల కేంద్రంతో పాటు అంతంపల్లి గ్రామ శివారుల్లో ఉన్న వ్యవసాయ బోరు బావుల వద్ద మోటర్ కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం వేకువ జామును కత్తిరించి అపహరించుకెళ్లారు. సుమారు 11మంది రైతులకు సంబందించిన కేబుల్ వైర్లు చోరీ కాగా, ఈ విషయమై వారు భిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ట్రాన్స్ఫార్మర్ కాపర్, ఆయిల్..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోని లక్ష్మి లిప్టు కోసం ముప్కాల్ మండలం నల్లూర్ శివారులో నిర్మించిన సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్పార్మర్ కాపర్ కాయిల్స్, ఆయిల్ చోరీకి గురైంది. లిప్టు ఆపరేటర్ భానుచందర్ బుధవారం ఉదయం సబ్స్టేషన్ వద్దకు వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై బుధవారం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ విచారణ చేపట్టారు. మే31 నుంచి జూన్ 10 మధ్య కాలంలో చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగులు రెండు ట్రాన్స్ఫార్మర్లను కింద పడేసి కాపర్ కాయిల్స్, ఆయిల్ ఎత్తుకెళ్లారు. లక్ష్మి లిప్టు డిప్యూటీ ఈఈ సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.