జిల్లాలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు

Jun 11 2025 9:04 AM | Updated on Jun 11 2025 9:04 AM

జిల్లాలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు

జిల్లాలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు

కామారెడ్డి టౌన్‌: జిల్లాలోని పలు ప్రాంతాలలో రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ టీం మంగళవారం అకస్మిక దాడులు నిర్వహించింది. ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ టీం హెడ్‌, జోనల్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో దాడులు సాగాయి. ముందుగా సదాశివనగర్‌ మండలంలోని పోసానిపేటలో గల ఫ్లోర్‌ మిల్‌లో తనిఖీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో శనగ, రాగి, జొన్నపిండి ప్రాసెస్‌ చేస్తున్నట్లు గుర్తించారు. కిటికీలకు మెష్‌ లేకపోవడం, మిల్‌లో బూజుతో కూడిన దుమ్ము ధూళి ఉండడం, రికార్డులు సరిగా లేకపోవడాన్ని గమనించారు. సుమారు రూ. 28.50 లక్షల విలువగల 42,500 కిలోల లేబుల్‌, ప్యాకింగ్‌ వివరాలు లేని అనుమానాస్పదంగా ఉన్న శనగపప్పును సీజ్‌ చేశారు. శాంపిల్స్‌ సేకరించి పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించామని జ్యోతిర్మయి తెలిపారు. యజమానికి నోటీసులు ఇచ్చామన్నారు.

జిల్లా కేంద్రంలో..

జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన గల పర్ణిక ప్యాలెస్‌, డిగ్రీ కళాశాల మైదానం ముందున్న వైష్ణవి ఇంటర్నేషనల్‌ హోటల్‌లలోనూ తనిఖీలు చేశారు. రొయ్యలు, చేపలు, చికెన్‌, కుల్లిన మాంసంతో పాటు, వెజ్‌, నాన్‌వేజ్‌ ఐటమ్‌లను ఒకే రిఫ్రిజిరేటర్‌లో కలిపి ఉంచడం, అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. పలుమార్లు వేడి చేసిన వంట నూనెలను ఆహా ర పదార్థాలలో వాడుతున్నట్లు గుర్తించారు. పర్ణిక ప్యాలెస్‌ హోటల్‌ స్టోర్‌ రూమ్‌లో రూ. 45 వేల విలువగల నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన ముడి సరుకులు, తేనె, ఫ్రూట్స్‌, పురుగు పట్టిన బియ్యం, మిల్‌ మేకర్‌, ధనియా పొడి తదితర పదార్థాలను ధ్వంసం చేశారు.

వైష్ణవి ఇంటర్నేషనల్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో సుమారు రూ.17 వేల విలువచేసే 40 కిలోల నిల్వ ఉంచిన దుర్వాసన వస్తున్న మాంసం, 10 కిలోల గోధుమ పిండి, 10 కిలోల కుళ్లిన రొయ్యలను గుర్తించి, ధ్వంసం చేశారు. వాటి యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. కొత్త బస్టాండ్‌ ముందున్న 3 హోటళ్లపైనా దాడులు చేసి నోటీసులు జారీ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు రోహిత్‌రెడ్డి, శ్రీషిక, పి.స్వాతి, జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ్లోర్‌మిల్‌లో రూ. 28 లక్షల

విలువైన శనగపప్పు సీజ్‌

పలు హోటళ్లలో కుళ్లిన మాంసం

గుర్తింపు, ధ్వంసం

యజమానులకు నోటీసులు జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement