
బడికి బాసటగా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తమ ఉన్నతికి బాటలు వేసిన చదువుల చెట్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి నడుం బిగించారు పాల్వంచ మండలం ఫరీదుపేట జెడ్పీ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల పూర్వ విద్యార్థులు. బడిలో కావలసిన మౌలిక సదుపాయాల కల్పన, కంప్యూటర్ తరగతుల నిర్వహణ, ఐఐటీ వంటి పరీక్షలకు సన్నద్ధం చేయడానికి అవసరమైన బోధకులు, పుస్తకాలు సమకూర్చడానికి అవసరమైన నిధిని సమకూర్చాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ చదివిన వారిలో ప్రొఫెసర్లు, డాక్టర్లు, సీఐ, టీచర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఇలా వివిధ స్థాయిల్లో స్థిరపడిన వారు ఉన్నారు. పాఠశాల అభివృద్ధికి వారంతా తలా ఓ చేయి అందించడానికి ముందుకు వచ్చారు. తమ స్థోమతను బట్టి తలా కొంత జమ చేసి రూ.30 లక్షలు నిధిని సిద్ధం చేశారు. అలాగే అదే బడిలో చదివి రాజకీయ నాయకులు కూడా పాఠశాల అభివృద్ధిలో తాము సైతం అంటున్నారు. అలాగే ఇంటింటికీ తిరిగి పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాలు..
ఫరీదుపేటలోని పాఠశాలల భవనాలకు రంగులు వేయించారు. గ్రౌండ్ను చదును చేయించారు. పూలమొక్కలు నాటించారు. శిథిలమైన భవనాలు, టాయ్లెట్లను కూల్చివేయించి నూతనంగా టాయ్లెట్లు నిర్మించారు. ప్రభుత్వ నిధులతో ప్రహరీ నిర్మాణం చేపట్టారు. రెండు నెలల కాలంలో పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలతో కలిసి పాఠశాల రూపురేఖలను మార్చారు.
పూర్వ విద్యార్థుల సాయంతో రంగులు దిద్దుకున్న పాఠశాల భవనం
లక్ష్యాలు..
ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం.
ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ గ్రామంలోని పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం.
విద్య, క్రీడా, కళారంగాల్లో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడం.
విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్, కంప్యూటర్ స్కిల్స్, పోటీ పరీక్షలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు చేపట్టడం.
పూర్వ ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల భాషపై తర్ఫీదు ఇవ్వడం.
పూర్వ విద్యార్థులను ప్రస్తుత విద్యార్థులతో అనుసంధానం చేయడం.
ఫరీదుపేటలో ఒక్కటైన
పూర్వ విద్యార్థులు
మౌలిక సదుపాయాలపై దృష్టి
రూ. 30 లక్షల నిధి సమీకరణ
విద్యార్థులను పోటీ పరీక్షలకు
తీర్చిదిద్దేలా చర్యలు
నేడు ఆత్మీయ సమ్మేళనం