
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
కామారెడ్డి టౌన్: ప్లాస్టిక్ వినియోగంలో నియంత్రణ పాటించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం కామారెడ్డి సీఎస్ఐ గ్రౌండ్లోగల వారసంతలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, ప్లాస్టిక్ వాడడం నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దన్నారు. వాటికి బదులుగా జూట్ బ్యాగులు, స్టీలు గ్లాసులు, ప్లేట్లను, పర్యావరణహితమైన వస్తువులనే వినియోగించాలని ప్రజలను కోరారు. ప్రతి పౌరుడు విరివిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, మెప్మా పీడీ శ్రీధర్, డీఎస్వో సిద్ధిరాంరెడ్డి, మున్సిపల్ డీఈ వేణుగోపాల్, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్ కుమార్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్, మెప్మా సిబ్బంది, మున్సిపల్ వార్డు అధికారులు పాల్గొన్నారు.