
డ్రమ్ము చెప్పే కన్నీటి కథ
కామారెడ్డి టౌన్: జిల్లాకేంద్రంలోని పలు కాలనీలలో తీవ్ర నీటి కొరత నెలకొంది. ప్రధానంగా అశోక్నగర్ కాలనీలో నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే అశోక్నగర్ కాలనీలోని బోర్లు ఎత్తిపోతాయి. దీంతో నీటి సమస్య ఏర్పడుతుంది. 11 వందల ఫీట్ల మేర బోరుబావులు తవ్వించినా చుక్క నీరు రావడం లేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. బోర్లు ఎత్తిపోతుండడంతో కాలనీవాసులు వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతుంటారు. ట్యాంకర్ ఎప్పుడొస్తుందా అని కాలనీవాసులు ఎదురు చూస్తుంటారు. ఇళ్ల ముందు రోడ్డు పక్కన డ్రమ్ములు పెట్టుకుని నిరీక్షిస్తూ ఉంటారు. వేసవిలో నీటి కొరత కారణంగా ఆ కాలనీలో ఏ ఇంటి ముందు చూసినా నీటి డ్రమ్ములు కనిపిస్తాయి. ట్యాంకర్ రాగానే డ్రమ్ములలో నీరు నింపుకుంటారు. తర్వాత ఆ నీటిని తిరిగి ఇళ్లలోకి మోసుకువెళ్తారు. అశోక్నగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న క‘న్నీటి’ కష్టాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. పాలకులు స్పందించి నీటి సమస్యకు త్వరగా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాకేంద్రంలో తీవ్ర నీటి సమస్య
ఇబ్బంది పడుతున్న ప్రజలు