
డీసీసీబీ సేవలకు ఐఎస్వో గుర్తింపు
నిజామాబాద్ సిటీ: జిల్లాకేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కస్టమర్లకు అందిస్తున్న సేవలకు గాను ఐఎస్వో ధ్రువీకరణ పత్రం అందజేసినట్లు చైర్మన్ రమేశ్రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బుధవారం పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్రెడ్డి మాట్లాడుతూ డీసీసీబీ అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నందుకు, బ్యాంకు నిర్వహణ, ఖాతాదారులకు బ్యాంకు ద్వారా అందిస్తున్న విలువైన సేవలకుగాను ఐఎస్వో ధ్రువీకరణ పత్రం (9001 : 2015) జారీ చేసిందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన ఆడిట్లో బ్యాంకు మంచి ఆర్థిక ఫలితాలు సాధించి, అన్ని విభాగాల్లో మెరుగైనట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ స్కోర్ 90 సాధించామని, ఇది బ్యాంకు చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించేందుకు సహకరించిన ఖాతాదారులకు, రైతులకు, సహకార సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. డీసీసీబీ డైరెక్టర్లు, సీఈవో నాగభూషణం, అధికారులు పాల్గొన్నారు.