
● నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి ముగ్గురి మృత్యువా
నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మృతదేహాల కోసం గాలిస్తున్న ఫైర్ సిబ్బంది, మృతుల బంధువులు
హర్షవర్ధన్
(ఫైల్)
నవీన్
(ఫైల్)
మధుకర్గౌడ్ (ఫైల్)
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్ : సరదాగా క్రికెట్ ఆడిన యువకులు.. ఈత కొట్టేందుకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లి నీట మునిగి మృతిచెందారు. ఈ ఘటన మూడు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలానికి చెందిన 11 మంది యువకులు సోమవారం సోమార్పేట్ గ్రామ శివారులో క్రికెట్ ఆడారు. అనంతరం స్నానం చేసేందుకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో దిగారు. వీరిలో ఎల్లారెడ్డికి చెందిన మధుకర్గౌడ్(17), సోమార్పేట్కు చెందిన హర్షవర్ధన్(17), తిమ్మారెడ్డికి చెందిన నవీన్(23) గల్లంతయ్యారు. మిగతావారు ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గల్లంతైనవారి కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో గాలించేందుకు ప్రయత్నించినా అప్పటికే చీకటి పడడంతో వెనుదిరిగారు. మంగళవారం ఉదయం ఫైర్ సిబ్బందితో పాటు మృతుల బంధువులు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో వలలతో గాలించారు. మొదట మధుకర్గౌడ్ మృతదేహం లభ్యమయ్యింది. మధ్యాహ్న సమయంలో నవీన్, హర్షవర్ధన్ల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం నిజాంసాగర్ పోలీసులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మిన్నంటిన రోదనలు
గల్లంతైనవారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు బ్యాక్వాటర్ ప్రాంతానికి చేరుకున్నారు. చెట్టంత కొడుకులు కళ్లముందు విగత జీవులుగా కనిపించడంతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. వారి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
గాలింపు చర్యలను
పట్టించుకోని అధికారులు
ముగ్గురు యువకులు గల్లంతైనా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫైర్ సిబ్బందితో పాటు మృతుల బంధువులు వలల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.
రోదిస్తున్న మధుకర్గౌడ్ కుటుంబ సభ్యులు
ఒక్కగానొక్క కుమారుడు..
సోమార్పేట గ్రామానికి చెందిన గూల రాజలింగం దంపతులకు హర్షవర్ధన్ (17) ఒక్కడే కొడుకు. ఇంటర్ చదువుతూ అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. సోమవారం సరదాగా ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కిషన్గౌడ్ పెద్ద కొడుకు మధుకర్గౌడ్ (17) ఇంటర్ చదువుతున్నాడు. తోటి వారితో ఆటపాటలతో సరదాగా ఉండేవాడు. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన మధుకర్.. నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.

● నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి ముగ్గురి మృత్యువా