కవిత అభిమానుల సోషల్‌ వార్‌ | - | Sakshi
Sakshi News home page

కవిత అభిమానుల సోషల్‌ వార్‌

Jun 4 2025 12:41 AM | Updated on Jun 4 2025 12:41 AM

కవిత

కవిత అభిమానుల సోషల్‌ వార్‌

లేఖలోనివి ఆరోపణలు కాదు..

నిజాలంటూ ప్రచారం

2019 నుంచే కవితపై జిల్లాలో కుట్రలు.. లోక్‌సభ ఎన్నికల్లో

ఓడిపోయేలా చేశారంటున్న

ఉద్యమకారులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె కవిత రాసిన లేఖ విషయమై ఉమ్మడి జిల్లాలో గులాబీ శ్రేణులు గుంభనంగా ఉన్నప్పటికీ ఉద్యమకారులు మాత్రం సోషల్‌ మీడియా వేదికగా స్వరం గట్టిగా వినిపిస్తున్నారు. లేఖలో కవిత రాసిన అంశాలు ఆరోపణలు కాదని, పచ్చి నిజాలంటూ సోషల్‌ మీడియాలో వరుస ప్రకటనలు చేస్తున్నారు. మా ధైర్యం మీరే కవితక్క, డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌ అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యమకారులైన కొందరు సీనియర్‌ కార్యకర్తలైతే మరింత ఘాటుగా సోషల్‌ వార్‌లోకి దిగారు. జిల్లాలో కవితపై 2018 నుంచే కుట్రలు మొదలయ్యాయని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమికి అప్పటి ఎమ్మెల్యేలే కారకులయ్యారని అందుకు తామే ప్రత్యక్ష సాక్షులమంటూ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఉద్యమకారులందరం కవిత వెంటే ఉంటామంటున్నారు. కవిత ఉనికిని ఓర్వలేని కొందరు మాజీ ప్రజాప్రతినిధులు.. పలువురు ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసినట్లు, కవితకు కమ్యూనికేట్‌ కాకుండా చేసినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నగరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడమే కాకుండా కవిత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దు, మా సోదరుడి ఫొటోను మాత్రమే పెట్టుకోవాలంటూ బెదిరించినట్లు చెబుతున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే సోదరుడు షాడో మాదిరిగా వ్యవహరించడమే కాకుండా దళితబంధు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ఇతర పథకాల్లో చాలామంది వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు.

పీఆర్‌వోనే లేఖ లీక్‌ చేసినట్లు

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌..

కవితకు పీఆర్‌వోగా ఉన్న రాజేష్‌ అనే వ్యక్తి కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్‌ చేసినట్లు తాజాగా సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. ఈ విషయమై కేటీఆర్‌, హరీశ్‌రావు టీములకు సాక్ష్యాధారాలతో పూర్తి వివరాలు తెలిసినట్లు వీడియోలో ఉంది. ఈ పీఆర్‌వోనే కవితకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని బయటకు విడుదల చేసినట్లు ఇందులో ఉంది. కేటీఆర్‌, హరీశ్‌రావులపై సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయించినట్లు పేర్కొన్నారు. తాజాగా కాంగ్రెస్‌లోని ఓ నాయకుడికి కోవర్టుగా మారి, కేటీఆర్‌, హరీశ్‌రావులకు వ్యతిరేకంగా జాతీయ మీడియాలో ప్రశ్నలు అడిగేలా ఈ పీఆర్‌వో చేసినట్లు ఇందులో పేర్కొన్నారు. కవితను ఎక్కువగా జాతీయ మీడియాలో కనిపించాలని ప్రేరేపించినట్లు వీడియోలో వివరించారు. తాజాగా కవిత రాసిన లేఖను సైతం ఈ పీఆర్‌వో రాజేషే తనకు సన్నిహితుడైన మీడియా పర్సన్‌ ద్వారా లీక్‌ చేసినట్లు పేర్కొన్నారు. జాతీయ మీడియా పేరిట కవిత వద్ద భారీగా డబ్బులు దండుకున్న ఇతను హైదరాబాద్‌ శివార్లలో విల్లా కొనుగోలు చేసినట్లు వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను కేటీఆర్‌, హరీశ్‌రావులకు పంపినట్లు ఉద్యమకారులు చెబుతున్నారు.

కవిత అభిమానుల సోషల్‌ వార్‌1
1/1

కవిత అభిమానుల సోషల్‌ వార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement