
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చదివించాలి
ఎల్లారెడ్డి/తాడ్వాయి : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే తాడ్వాయితో పాటు కృష్ణాజీవాడి, బ్రహ్మాజీవాడి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఎంఈవో రామస్వామి మాట్లాడారు. ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బడిబాటను విజయవంతం చేయాలి
బాన్సువాడ రూరల్: జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ ఎంపీడీవో ముజాహిద్ కోరారు. శుక్రవారం ఆయన బోర్లంక్యాంపులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బడిబాట సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీఎల్పీవో సత్యనారాయణరెడ్డి, నాయకులు పీర్యానాయక్, శ్రీనివాస్రెడ్డి, విష్ణు , వంశీ, హరికృష్ణ, సంత్యాలి,సావిత్రి, ఉపాధ్యాయులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.