
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి) : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. లింగంపేట మండల కేంద్రంలో ఫార్మీన్ బేగం ఇంటి నిర్మాణానికి కలెక్టర్ శుక్రవారం ముగ్గుపోసి మార్క్ అవుట్ ఇచ్చారు. కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని, అవసరమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. రవాణా, లేబర్ ఖర్చులు లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందన్నారు. దశల వారీగా నిర్మాణ పనులను బట్టి రూ.5 లక్షలు చెల్లిస్తామన్నారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. వర్షా కాలం ప్రారంభానికి ముందే మురికి కాల్వల్లో పూడికను తొలగించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. వర్షం నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి మురళి, మండల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో పీడీ సురేందర్, ఎంపీడీవో నరేశ్, కార్యదర్శి శ్రావణ్కుమార్ ఉన్నారు.