
ప్రయాణ ప్రాంగణాలపై పట్టింపేది..?
నస్రుల్లాబాద్: ఆర్టీసీ అధికారుల తీరుతో ప్రయాణ ప్రాంగణాలపై పట్టింపు లేకుండా పోయింది. ఉచిత బస్సు సౌకర్యం అమలులో ఉండటంతో బస్సుల్లో ప్రయాణించే జనం సంఖ్య పెరిగింది. దీంతో బస్సు వచ్చే వరకు బస్టాండుల్లో వేచి చూడాల్సి వస్తోంది. కానీ బస్టాండ్లో మాత్రం కనీస వసతులు కల్పించ క పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండుల్లో తాగు నీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక పోవడంతో ప్రయాణికులుఅసహనంవ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లు గడిచినా వసతులు కరువు
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో దశాబ్దాల క్రితం బస్టాండ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు బస్సులు వెళ్తుంటాయి. అంతే కాకుండా నస్రుల్లాబాద్ చుట్టూ ఉన్న గ్రామాల్లో సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్కు సైతం ప్రజలు వెళ్తుంటారు. అర్ధరాత్రుళ్లు కూడా బస్టాండ్లో ప్రజలు లేట్ నైట్ బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బస్టాండ్ను ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ మరుగుదొడ్లు, నీటి వసతి కల్పించడంలో మాత్రం ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెమ్లి గ్రామానికి చెందిన దాతలు బస్టాండ్ ప్రాంగణం నిర్మించి ఇచ్చారు. కానీ కనీస వసతులు లేక నిరుపయోగంగా మారింది. కామిశెట్టిపల్లి, అంకోల్ వంటి గ్రామాల్లో కూడా ప్రయాణ ప్రాంగణాల వైపు అధికారులు కన్నెత్తి చూడక పోవడంతో నిరుపయోగంగా మారాయి.
అద్దెలు సరే.. అవసరాల మాటేమిటి
ఆర్టీసీ బస్టాండ్లో వ్యాపారాలు చేయాలంటే టెండర్ వేసి అద్దెలు వసూలు చేస్తారు. ఇదే తరహాలో నస్రుల్లాబాద్ బస్టాండ్లో కూడా ఏళ్లుగా వ్యాపార సముదాయాలకు అద్దెలు వసూలు చేస్తున్నారు. వీటితో ఆర్టీసీ లాభాలు పొందుతుందే కానీ ప్రయాణికుల అవసరాలను తీర్చడంలో శ్రద్ధ వహించడం లేదు. ఇకనైనా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సౌకర్యం, మరుగుదొడ్ల సదుపాయం కల్పిచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కనీస వసతులు లేని నస్రుల్లాబాద్ బస్టాండ్
అసౌకర్యాల నడుమ బస్టాండ్లు
కనీస వసతుల కల్పనలో ఆర్టీసీ
అధికారుల నిర్లక్ష్యం
ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు