
అనుమతి ఒకచోట.. తవ్వకం మరో చోట
బిచ్కుంద(జుక్కల్): మొరం తవ్వకాలకు అనుమతి ఒక చోట పొంది తవ్వకం మరో చోట చేస్తూ బిచ్కుంద మండలంలో మొరం మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా మొరం తవ్వకాలు జరిపి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లలో ప్రభుత్వ భూమి బిచ్కుంద శివారు తక్కడ్పల్లి రోడ్డు లో తవ్వకాలు జరుపుతున్నారు. బుధవారం స్థానికులు తహసీల్దార్ వేణుగోపాల్కు ఫిర్యాదు చేయడంతో ఆర్ఐ రవీందర్, సిబ్బందిని పంపించారు. ఒక జేసీబీ, 6 మొరం ట్రాక్టర్లు పట్టుకొని సీజ్ చేశామని తహసీల్దార్ తెలిపారు. బిచ్కుంద శివారులో పెరుగు కిష్టారెడ్డికి చెందిన సర్వే నంబర్ గల 653, 666 పట్టా భూమి 54 గుంటలలో వేయి టన్నుల మొరం తవ్వకాల కోసం మైన్స్ శాఖకు శ్రీరాం అనే వ్యక్తి రూ.20 వేలు సీనరేజ్ చార్జీలు చెల్లించారని తహసీల్దార్ వేణుగోపాల్ తెలిపారు. మొరం తవ్వడానికి జూన్ 14 వరకు అనుమతి ఉందన్నారు.
గతవారం రోజుల నుంచి అక్కడ తవ్వకుండా తక్కడ్పల్లి రోడ్డు ప్రభుత్వ భూమి సర్వేనంబర్ 814లో మొరం తవ్వి విక్రయిస్తున్నాడు. ఫిర్యాదుతో వెంటనే పరిశీలించగా అనుమతి ఉన్న చోట మొరం తవ్వకుండా, అధికారులను పక్కదారి పట్టించి ప్రభుత్వ భూమిలో మొరం తవ్వుతూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. పట్టా భూమిలో పొందిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని మైన్స్ అధికారులు, బాన్సువాడ సబ్ కలెకర్ట్కు నివేదిక పంపించినట్లు తహసీల్దార్ తెలిపారు.
జేసీబీ, ట్రాక్టర్లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు
రెచ్చిపోతున్న మొరం మాఫియా
బిచ్కుందలో జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు