
షట్టర్లు లేక చెరువు నీరు ఖాళీ
నిజాంసాగర్(జుక్కల్): వరుణుడు కరుణించినా.. అధికారులు కరుణించకపోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువు నీళ్లు ఆయకట్టు భూములను ముంచెత్తుతూ పరుగులు తీస్తుండటంతో బుధవారం నర్వ గ్రామ రైతులు కదం తొక్కారు. ఇసుక బస్తాలను అడ్డుకట్టగా వేసి సాగు నీరు వృఽథా కాకుండా కాపాడుకున్నారు. మహమ్మద్ నగర్ మండలం నర్వ శివారులోని పాత చెరువు తూములకు షట్టర్లు లేకపోవడంతో నీరు ఖాళీ అవుతోంది. చెరువులోకి వచ్చిన వరద నీరు.. వచ్చింది వచ్చినట్లుగా తూముల ద్వారా వృథాగా పోతోంది. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా రైతులు సొంతంగా ఇసుక బస్తాలను అడ్డు కట్టగా వేసుకున్నారు. నర్వ పాత చెరువు కుడి, ఎడమ పంట కాలువల తూములకు షట్టర్లు లేకపోవడంతోనే సాగు నీరు వృథాగా పోతోందని అధికారులు స్పందించి షట్టర్లు బిగించాలని రైతులు కోరుతున్నారు.
● ఆయకట్టును ముంచెత్తిన చెరువు నీళ్లు
● తూములకు ఇసుక బస్తాలు
అడ్డుకట్టగా వేసిన రైతులు

షట్టర్లు లేక చెరువు నీరు ఖాళీ