
గ్రామాల్లో కేంద్రం బృందం పర్యటన
డిచ్పల్లి/ ఎడపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, వాటి ప్రయోజనాలను ప్రజలను అడిగి తెలుసుకునేందుకు కేంద్ర బృందాల సభ్యులు జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించారు. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి మేజర్ గ్రామం, ఘన్పూర్ గ్రామాలను సెంట్రల్ సెక్రెటేరియట్ సర్వీసెస్ ఆఫీసర్లు భానుప్రతాప్ సింగ్, జైపాల్ మౌర్య, దివ్య సింగాల్, హర్విందర్ పర్యటించారు. స్వచ్ఛభారత్ మిషన్, తడి, పొడి చెత్త నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణపై ప్రజలకు ఉన్న అవగాహన, రైతు బీమా పథకాల అమలుపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎడపల్లి మండలం జానకంపేటలో కేంద్ర బృందం సభ్యులు గ్రామంలోని మహిళా సంఘం సభ్యులతో వారికి అందుతున్న రుణాలపై ఆరా తీశారు.