
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
ఎస్పీ రాజేశ్ చంద్ర
పెద్దకొడప్గల్(జుక్కల్): జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశించారు. పెద్దకొడప్గల్ పోలీస్స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 760 దొంగతనాలు జరిగాయని, వచ్చే ఏడాదిలో చోరీలు జరగకుండా చూస్తామన్నారు. 150 మేజర్ చోరీ కేసుల్లో 82 పరిష్కరించామన్నారు. 161 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హైవే అథారిటీ వారితో మాట్లాడి త్వరలో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయిస్తామని అన్నారు. చౌరస్తాల వద్ద వాహనాల వేగం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు చోరీ కాకుండా పెట్రోలింగ్ పెంచడంతోపాటు విద్యుత్ శాఖ అధికారుల సహాయంతో గస్తీ ముమ్మరం చేస్తామన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ద్వారా సీసీ టీవీల ప్రాముఖ్యత, డయల్ 100 వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలన్నారు. డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐ నరేశ్, ఎస్సై మహేందర్ ఉన్నారు.