ఉమ్మడి జిల్లా నుంచి.. | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా నుంచి..

May 28 2025 11:51 AM | Updated on May 28 2025 11:51 AM

ఉమ్మడి జిల్లా నుంచి..

ఉమ్మడి జిల్లా నుంచి..

● సదాశివనగర్‌ మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన

నీల స్వామి ఎనిమిదేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. రెండేళ్లకోసారి

ఇంటికి వచ్చి రెండు మూడు నెలలు ఉండి వెళుతుంటాడు. నాలుగు నెలల క్రితం అతడి ఆరోగ్యం దెబ్బతింది. అక్కడే వైద్యం చేయించుకున్నాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయన మృతదేహం ఇంటికి చేరడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లున్నారు. ఇంటి పెద్ద దిక్కు ను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది.

● రామారెడ్డి మండలం గోకుల్‌ తండాకు చెందిన మాలోత్‌ భాస్కర్‌ అనే యువకుడు పది నెలల కింద దుబాయి వెళ్లాడు. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని స్నేహితులు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ విషయమై సోమవారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో మృతుడి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. శవాన్ని అక్కడి

నుంచి రప్పించడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నీల స్వామి (ఫైల్‌), తిర్మన్‌పల్లి

మాలోత్‌ భాస్కర్‌ (ఫైల్‌),

గోకుల్‌ తండా

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గల్ఫ్‌లో ఉపాధి.. అదో రంగుల కల. ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేనివారికి ప్రత్యామ్నాయంగా కనిపించేది ప్రాంతం.. అక్కడికి వెళితే నాలుగు డబ్బులు సంపాదించగలమన్న నమ్మకం.. నూనూగు మీసాల వయసులోనే చాలా మంది గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతుంటారు. కొన్ని కుటుంబాల్లో అయితే రెండు, మూడు తరాల వాళ్లూ గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. ఇప్పటికీ వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది గల్ఫ్‌ బాట పడుతున్నారు. వీసాల కోసం కొందరు అప్పులు చేస్తుంటే, మరికొందరు ఉన్న భూమిని అమ్ముకుంటున్నారు. భార్య మెడలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి వెళ్లేవారూ ఉన్నారు. కామారెడ్డి ప్రాంతంనుంచి ఐదు దశాబ్దాల కిందటే వలసలు మొదలైనా మూడు దశాబ్దాల నుంచి గల్ఫ్‌ వలసలు పెరిగాయి. వరుస కరువు కాటకాలతో పంటలు పండక వ్యవసాయాన్ని వదిలేసి వెళ్లిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే భార్య, పిల్లల్ని వదిలి గల్ఫ్‌ దేశాలకు వెల్లిన వారు అక్కడ తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవలి కాలంలో పలువురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాల్లోనూ పలువురు చనిపోతున్నారు. సరైన సంపాదన లేక, అప్పులు తీర్చే దారి కానరాక కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో గల్ఫ్‌ దేశాల నుంచి నెలకో చావు వార్త వస్తోంది. ఎడారి దేశంలో చనిపోయిన వ్యక్తి శవం రావడానికి ఒక్కోసారి రెండు మూడు నెలలు కూడా వేచిచూడాల్సిన పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యుల వేదన అంతాఇంతా కాదు.

ఐదేళ్లలో యాభైమందికిపైగా మృతి

జిల్లాలో ప్రధానంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లోని మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, కామారెడ్డి, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట, తాడ్వాయి, గాంధారి, లింగంపేట తదితర మండలాల నుంచి ఎక్కువ మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. ఐదేళ్ల కాలంలో జిల్లాకు చెందిన యాభై మందికిపైగా ఆయా దేశాల్లో వివిధ కారణాలతో చనిపోయారు. ఇటీవలి కాలంలో గుండెపోటుతో చనిపోతున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. నెలకో చావు వార్త వస్తుండడంతో గల్ఫ్‌ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నాలుగు డబ్బులు సంపాదించడానికి వెళ్లిన వ్యక్తి శవపేటికల్లో ఇంటికి చేరుతుండడంతో ఆ కుటుంబాలకు తీరని వేదన మిగులుతోంది.

కారణాలెన్నో..

బతుకుదెరువు కోసం ఎన్నో ఆశలతో గల్ఫ్‌ బాటపట్టిన ఎందరి జీవితాల్లో అర్ధంతరంగా ఆరిపోతున్నాయి. ఎన్నో ఆశలతో లక్షలు ఖర్చుచేసి గల్ఫ్‌ దేశానికి వెళ్లినా అక్కడి కంపెనీలు సరైన వేతనాలివ్వక పోవడంతో వీసా కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పనులకు వెళ్లే సమయంలో రోడ్డు దాటుతూ ప్రమాదాల్లో కొందరు.. పనిలో ఉండగా పెద్దపెద్ద భవనాలపై నుంచి పడిపోయి కొందరు చనిపోయారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడంతో మానసికంగా నలిగిపోయి పలువురి గుండెలు ఆగిపోయాయి.

బతుకుదెరువుకోసం

ఎడారి దేశాలకు వలస

వివిధ కారణాలతో నెలకో చావు వార్త

రోడ్డున పడుతున్న కుటుంబాలు

ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు వలసలు ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువగా దుబాయి, ఒమన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే 10 లక్షల మంది గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తుండగా.. అందులో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారు 1.50 లక్షల మంది ఉంటారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన వారు 4 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement