
తల్లిగారింటికి వస్తూ అనంతలోకాలు..
మాచారెడ్డి : తల్లిగారింటికి వస్తున్న ఓ గృహిణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఐదు నిమిషాల్లో ఇళ్లు చేరుతుందనగా మృత్యువు కబలించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నపేట గ్రామానికి చెందిన సులోచన (36) సోమవారం ఇద్దరు కుమారులు అన్వేష్, శివాన్స్లతో కలిసి బస్సులో వచ్చి మాచారెడ్డి చౌరస్తాలో దిగింది. తండ్రి నారాయణకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో నారాయణ తన టీవీఎస్ మోపెడ్పై ఇద్దరు మనుమలు, కూతురు సులోచనను తీసుకొని లచ్చాపేట గ్రామానికి వెళుతుండగా స్టేజీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన బైకు ఢీకొట్టింది. తీవ్రగాయాలైన సులోచనను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి నారాయణ, ఇద్దరు కుమారులు చికిత్స పొందుతున్నారు. కాగా, సులోచన భర్త మహేందర్ బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు..
నందిపేట్ (ఆర్మూర్): రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన నిర్మల్ జిల్లాకు చెందిన జాదవ్ సుందా బాయి(70) చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కుంటాల మండలం దౌనెల్లి తాండకు చెందిన రాథోడ్ సంతోష్ తల్లి రాథోడ్ యమునాబాయి ఆరోగ్యం బాగోలేదని అత్తమ్మ జాదవ్ సుందబాయితో కలిసి సోమవారం ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి డాక్టర్ వద్దకు ఆటోలో వస్తున్నారు. నందిపేట మండలం వెల్మల్ గ్రామ సమీపంలో ఎదురుగా బైక్ పై అతివేగంగా వచ్చిన పెద్ద అంజన్న ఆటోని ఢీకొట్టాడు. ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలుకావడంతో నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ జాదవ్ సుందబాయి మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.