
రామాయంపేట్లో రోడ్డు ప్రమాదం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు. వారాంతపు సెలవుల్లో కలిసే గ్రామానికి వచ్చి రెండు రోజులపాటు కుటుంబసభ్యులు, మిత్రులతో సంతోషంగా గడిపి తిరిగి ఉద్యోగానికి వెళుతుంటారు. అలాంటిది సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం వారి జీవితంతోపాటు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో ఒక యువకుడు అక్కకడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన బూస లింబాద్రి, లక్ష్మి దంపతులు కొడుకు నిఖిల్ (24), మల్లాపురం నర్సయ్య, సునీత దంపతుల కొడుకు నితీశ్ మంచి స్నేహితులు. ప్రస్తుతం హైదరాబాద్ మాదాపూర్లోని అర్కబ్రాంకమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. శని, ఆదివారం వీకెండ్ సెలవుల్లో భాగంగా గ్రామానికి వచ్చారు. తిరిగి సోమవారం ఉదయం 6 గంటలకు ఇద్దరూ కలిసి మోటార్ బైక్పై హైదరాబాద్కు బయలుదేరారు. మెదక్ జిల్లా రామాయంపేట బైపాస్ క్రాసింగ్ వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై వీరి బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నిఖిల్ అక్కడిక్కకడే మృతి చెందగా నితీశ్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకొని రామాయంపేట్కు చేరుకున్న కుటుంబసభ్యులు నితీశ్ను సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నితీశ్ పరిస్థితి విషమంగా ఉంది. అందరితో కలిసి మెలిసి ఉండే నిఖిల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, నితీశ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరడంతో ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. సాయంత్రానికి గ్రామానికి చేరుకున్న నిఖిల్ మృతదేహానికి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, గ్రామస్తులు కన్నీళ్లతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
ఖిల్లా డిచ్పల్లిలో విషాదం